కుంకుడు సాగుపై రైతులకు శిక్షణ
గరిడేపల్లి : వ్యవసాయంలో రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా కుంకుడుకాయ సాగు మరియు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు కేవీకే శాస్త్రవేత్త డి. నరేష్ తెలిపారు. గురువారం ఈ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ శ్రీహరిప్రసాద్ హాజరై మాట్లాడారు. కుంకుడుగాయ పంట రైతులకు స్థిరమైన మరియు లాభాదాయకమైన ఆదాయ వనరుగా మారగలదని తెలిపారు. ఈ పంట సాగుకు తక్కువ ఖర్చుతో పాటు మంచి మార్కెట్ అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా విలువ ఆధారిత ఉత్పత్తులు.. కుంకుడుగాయ పొడి, షాంపు, సబ్బులు, ఇతర సహజ ఉత్పత్తుల తయారీ ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని వివరించారు. అదేవిధంగా బ్యాంకుల ద్వారా రుణం పొంది చిన్నస్థాయి ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన ద్వారా గ్రామీణ యువత, మహిళలు ఆదాయం పెంచుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న రైతులకు సర్టిపికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారి మహేష్, కేవీకే శాస్త్రవేత్తలు ఎ. కిరణ్, ఎన్. సుగంధి, ఎ. నరేష్, రైతులు పాల్గొన్నారు.


