అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
మునగాల: సెల్ఫోన్ టవర్ల వద్ద బ్యాటరీలు చోరీ చేస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను గురువారం మునగాల పోలీసలు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ బి. ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్కు చెందిన తబరక్ హుస్సేన్, ఉత్తరాఖండ్కు చెందిన అహ్మద్ సుఫియాన్, ఉత్తరప్రదేశ్కు చెందిన రైసుద్దీన్, సులేమాన్ గతంలో సెల్ఫోన్ టవర్ల వద్ద బ్యాటరీ పనులు చేసేవారు. ఈ నలుగురు జల్సాలకు అలవాటుపడి ముఠాగా ఏర్పడి సెల్ఫోన్ టవర్లలోని బ్యాటరీలను చోరీ చేస్తున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మునగాల మండలం మొద్దులచెరువు గ్రామ స్టేజీ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. వీరు నలుగురు కారులో వెళ్తూ పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా సెల్ఫోన్ టవర్లలోని బ్యాటరీలను పోలీసులు గుర్తించారు. నలుగురిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. నిందితులు నలుగురు వికారాబాద్, గద్వాల జిల్లాల్లోని ఐదు ప్రాంతాల్లో సెల్ఫోన్ టవర్లలో బ్యాటరీలు చోరీ చేసి సికింద్రాబాద్కు చెందిన అమిత్కుమార్ ద్వారా ఢిల్లీలో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరు ఇటీవల మునగాల మండలం ఇందిరానగర్ వద్ద ఉన్న జియో సెల్టవర్కు ఏర్పాటు చేసిన ఆరు బ్యాటరీలను కూడా చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని ఎస్ఐ తెలిపారు. వీరి నుంచి రూ.3.60లక్షల విలువ గల బ్యాటరీలతో పాటు కారు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.


