న్యాయవాది ఇంటిపై దాడి
ఫ నలుగురిపై కేసు నమోదు
నల్లగొండ, రామగిరి(నల్లగొండ): న్యాయవాది ఇంట్లోకి నలుగురు చొరబడి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి జరిగింది. నల్లగొండ పట్టణంలోని ఆనంద్నగర్లో నివాసముంటున్న గూడె నరేష్కుమార్ నల్లగొండ జిల్లా కోర్టులో జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి నరేష్కుమార్ తాను ప్రాక్టీస్ చేస్తున్న సీనియర్ న్యాయవాది ఆఫీస్లో ఉండగా.. కొందరు వ్యక్తులు అతడి ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ద్విచక్ర వాహనం, ఇంటి సామగ్రి ధ్వంసమయ్యాయి. నరేష్కుమార్ భార్య శైలజ, కుమార్తె లక్ష్మీప్రణవికి గాయాలయ్యాయి. అయితే నల్లగొండకు చెందిన దగ్గర బంధువులైన దేవరకొండ వేణుగోపాల్, పోలిశెట్టి కృష్ణవేణి, ప్రణీత, యాదయ్య కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. దీంతో పాటు యాదయ్య కుమార్తె ప్రణీత తన భర్తతో మనస్పర్ధల కారణంగా విడిగా ఉంటోంది. ప్రణీత తన భర్తపై కేసు పెట్టగా.. న్యాయవాది నరేష్కుమార్ ఆమె భర్త తరఫున కేసు వాదిస్తున్నాడు. దీంతో నరేష్కుమార్పై కోపం పెంచుకున్న పోలిశెట్టి యాదయ్య, కృష్ణవేణి, ప్రణీత, వేణుగోపాల్.. అతడి ఇంటిపై దాడి చేసి ఆయన కుటుంబ సభ్యులను గాయపర్చారు. నరేష్కుమార్ భార్య గూడె శైలజ ఫిర్యాదు మేరకు నలుగురుపై కేసు నమోదు చేసినట్లు నలగొండ టూటౌన్ ఎస్ఐ ఎర్ర సైదులు తెలిపారు. ఈ దాడికి నిరసనగా గురువారం జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన ర్యాలీ చేపట్టారు.


