శివాలయంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట క్షేత్రానికి అనుబంధంగా యాదగిరి కొండపై ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం సంప్రదాయ పర్వాలను అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. శివాలయంలో కొలువైన మహాశివుడికి రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖమండపంలోని స్పటికలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, ఆరాధన, గర్భాలయంలోని స్వయంభూ, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళాలతో సహస్రనామార్చన జరిపించారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్య తిరుకల్యాణం వేడుకగా చేపట్టారు. సాయంత్రం స్వామి, అమ్మవారి వెండి జోడు సేవలను మాఢ వీధుల్లో ఊరేగించారు.


