వర్కర్‌గా చేరి పథకం ప్రకారం చోరీ | - | Sakshi
Sakshi News home page

వర్కర్‌గా చేరి పథకం ప్రకారం చోరీ

Sep 24 2025 7:47 AM | Updated on Sep 24 2025 7:47 AM

వర్కర

వర్కర్‌గా చేరి పథకం ప్రకారం చోరీ

మిర్యాలగూడ అర్బన్‌: మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణవి గ్రాండ్‌ రెస్టారెంట్‌లో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ మంగళవారం మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరులకు వెల్లడించారు. రాజస్తాన్‌ రాష్ట్రం జలోర్‌ జిల్లా రాణివార మండలం కోర్కా గ్రామానికి చెందిన మహ్మద్‌ రహీం ఖాన్‌ మిర్యాలగూడ పట్టణానికి బతుకుదెరువు కోసం వచ్చిన పట్టణంలోని సాగర్‌ రోడ్డులో గల వైష్ణవి గ్రాండ్‌ రెస్టారెంట్‌ ముందు టీస్టాల్‌లో మాస్టర్‌గా పనికి కుదిరాడు. ఈ క్రమంలో రెస్టారెంట్‌కు సంబంధించిన విషయాలను తెలుసుకుని, అందులో చోరీ చేసేందుకు గాను తన స్నేహితులైన రాజస్తాన్‌ రాష్ట్రం జలోర్‌ జిల్లా సాయిలా మండలం పోవ్రాపు గ్రామానికి చెందిన ఇక్బాల్‌ఖాన్‌, లాలూఖాన్‌తో కలిసి ఏపీలోని జగ్గయ్యపేటలో ఒక గదిని అద్దెకు తీసుకుని ప్రణాళిక రచించారు. పథకం ప్రకారం ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వైష్ణవి గ్రాండ్‌ రెస్టారెంట్‌ బయట రహీంఖాన్‌, లాలూఖాన్‌ ఉండగా.. ఇక్బాల్‌ఖాన్‌ మెట్లు ఎక్కి ఫస్ట్‌ ఫ్లోర్‌లోని చాంబర్‌ తలుపునకు ఉన్న తాళం పగులగొట్టాడు. చాంబర్‌ లోపలికి ప్రవేశించి కౌంటర్‌ను బద్దలుకొట్టి అందులో దాచిన రూ.80లక్షలను అపహరించి ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై జగ్గయ్యపేటకు పారిపోయారు. అనంతరం కొంత నగదును ముగ్గురు పంచుకుని వారి సొంత గ్రామాలకు వెళ్లి జల్సాలు చేశారు. రెస్టారెంట్‌ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మిర్యాలగూడ వన్‌ టౌన్‌ పోలీసులు, నల్లగొండ సీసీఎస్‌ పోలీసులతో కలిసి నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. అయితే తీసుకెళ్లిన డబ్బులు అయిపోవడంతో వారు ముగ్గురు తిరిగి జగ్గయ్యపేటలోని గదిలో దాచుకున్న డబ్బులను తీసుకునేందుకు వచ్చారు. అప్పటికే జగ్గయ్యపేటలో నిఘా పెట్టిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. వారి నుంచి రూ.66.50 లక్షల నగదు, ఒక ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన నాలుగు బృందాలను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు, నల్లగొండ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ జితేందర్‌రెడ్డి, వన్‌టౌన్‌ సీఐ నాగభూషణం, టూటౌన్‌ సీఐ సోమనర్సయ్య, ఎస్‌ఐలు సతీష్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, సీసీఎస్‌ ఎస్‌ఐలు విజయ్‌కుమార్‌, విష్ణు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఫ మిర్యాలగూడ వైష్ణవి గ్రాండ్‌ రెస్టారెంట్‌లో చోరీకి పాల్పడిన ముగ్గురి అరెస్ట్‌

ఫ రూ.66.50 లక్షలు రికవరీ

ఫ వివరాలు వెల్లడించిన

నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

వర్కర్‌గా చేరి పథకం ప్రకారం చోరీ1
1/1

వర్కర్‌గా చేరి పథకం ప్రకారం చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement