తూర్పుతాళ్లులో నేలకొరిగిన తాడిచెట్టు
చామకూరిపాలెం మోడిలో విద్యుత్ స్తంభం
నరసాపురం రూరల్: నరసాపురం తీర ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. నరసాపురం పట్టణంతో పాటు నరసాపురం మండలంలోని సీతారాంపురం, రుస్తుంబాద, యర్రంశెట్టిపాలెం, తూర్పుతాళ్లు, మొగల్తూరు మండలంలోని పేరుపాలెం నార్త్, కేపీ పాలెం, రామన్నపాలెం, లక్కువారితోట, శేరేపాలెం, మొగల్తూరు, కుక్కలవారితోట తదితర గ్రామాల్లో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభా లు, చెట్లు నేలకొరిగాయి. కొబ్బరి, మామిడి, ఆకుకూరలు తదితర పంటలకు నష్టం వాటిల్లింది. ప లు ప్రాంతాల్లో చెట్లకు ఉన్న మామిడి పండ్లు రాలిపోయాయి. దీంతో బుధవారం నేలరాలిన కాయలను ఏరుకుని సంతకు తీసువచ్చి అయినకాడికి అమ్ముకున్నారు. మొగల్తూరులో ఓ ఇంటిపై తాడి చెట్టు పడటంతో భవనం పైకప్పు దెబ్బతినడంతో పాటు ప్రహరీ గోడ కూలిపోయింది. పలు ఇళ్లల్లో ఫ్యాన్లు, ఏసీలు, విద్యుత్ ఉపకరణాలు కాలిపోయినట్టు సమాచారం. ప్రధాన రహదారుల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో ఉదయం వరకూ వాహన రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.


