భీమవరం: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని యుటీఎఫ్ జిల్లా కమిటీ బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఖజానా అధికారి కార్యాలయాల్లో వినతిపత్రాలు అందచేశారు. గత విద్యా సంవత్సరంలో నెలవారీ మీటింగ్స్ వివరాలు, తీర్మానాలు, ఫొటోలు 24 గంటల్లో అప్లోడ్ చేయాలనే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని, జూన్ నెలలో నిర్వహించే ట్రైనింగ్ షెడ్యూల్ను వాతావరణ పరిస్థితులు, ఉపాధ్యాయుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఖరారు చేయాలని, పదో తరగతి మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని, మెడికల్ బిల్లులు ఏలూరుకు పంపడం, తిరిగి వచ్చిన మెడికల్ బిల్లులను ప్రొసీడింగ్ ఇచ్చి డిస్పాచ్ చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణను కోరారు. కార్యక్రమంలో యుటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఎస్ విజయ రామరాజు, పి.క్రాంతి కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీవీ రామానుజరావు(గాంధీ), జిల్లా గౌరవాధ్యక్షుడు సీహెచ్ పట్టాభిరామయ్య తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: జిల్లా శాప్ లీగ్–2026 అథ్లెటిక్స్ పోటీల్లో అండర్–16, 20 బాలబాలికల విభాగాల్లో యువ క్రీడాకారులు ప్రతిభ చూపి విజేతలుగా నిలిచారని జిల్లా క్రీడల అధికారి టీఎస్డీఓ ఎన్.మోహన్దాస్ చెప్పారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలోని అథ్లెటిక్ మీట్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. అండర్–16 బాలుర విభాగం 60 మీటర్ల పరుగు పందెంలో సంతోష్కుమార్ విజేతగా నిలవగా జావెలిన్ త్రో విభాగంలో కల్యాణ్ ప్రథమ స్థానం, 600 మీటర్ల విభాగంలో శ్రీహరి లంజా సాత్విక్ ప్రతిభ కనబర్చినట్లు చెప్పారు. అండర్–20 బాలుర విభాగం 100 మీటర్ల పోటీలో జి.సోమేశ్వరరావు, 800 మీటర్ల పోటీలో బి.వినోద్ విజయం సాధించారని, లాంగ్ జంప్లో వీవీ అవినాష్, హైజంప్ విభాగంలో ఎల్వీ గణేష్, ఎన్వీ గణేష్, 400 మీటర్ల విభాగంలో హర్షవర్ధన్ ఉత్తమ ప్రదర్శన కనబర్చారన్నారు. అండర్–16 బాలికల విభాగం లాంగ్ జంప్లో జి.పవిత్ర, 60 మీటర్ల పోటీలో టి.వనిత ప్రథమ స్థానం సాధించగా 600 మీటర్ల విభాగంలో అశ్విత, అశ్రితలు ప్రతిభ కనబర్చారు.


