భీమవరం: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం భీమవరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో వార్షిక తనిఖీలు నిర్వహించారు. తొలుత ఆయనకు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు కార్యాలయంలోని వివిధ విభాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో గడిచిన ఏడాది కాలంలో జిల్లాలో నమోదైన నేరాల గణాంకాలు, దర్యాప్తు పురోగతి, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి నివేదికలను తెలుసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం డీఎస్పీలు రఘువీర్ విష్ణు, ఎం సుధాకరరావు, డి విశ్వనాథ్, జిల్లా ఆర్మ్ర్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పోలవరం రూరల్: నేషనల్ పార్క్, టైగర్ జోన్ల పేరుతో ఆదివాసులను అడవుల నుంచి తరలిస్తే తిరుగుబాటు తప్పదని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి సుధాకర్ అన్నారు. గడ్డపల్లిలో మంగళవారం సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు పోరండ్ల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నేషనల్ పార్క్ పేరుతో టైగర్ జోన్ల అభివృద్ధి పేరుతో గడ్డపల్లి పంచాయతీ గ్రామాలైన దారువాడ, చిలకలూరు, తంగేడుగొండ, గిన్నెపెల్లి, చీమలూరు, గడ్డపల్లి గ్రామాలను అడవి నుంచి ఖాళీ చేయించాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టారు. ఆదివాసులు, అడవి జంతువులు కలిసి మెలిసి జీవిస్తున్న ప్రకృతి సహజ సిద్ధ జీవన సౌందర్యం అడవిని ప్రభుత్వం ధ్వంసం చేయడం కోసం ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు కారం రాఘవ, సరియం రామ్మోహన్, పీవైఎల్ జిల్లా కన్వీనర్ గురుగుంట్ల ప్రసాద్, అరుణోదయ రాష్ట్ర కమిటీ నాయకుడు నడపల ముక్క రెడ్డి, ముంజలూరు సర్పంచ్ కెచ్చల ముక్కారెడ్డి, గడ్డపల్లి వైస్ ప్రెసిడెంట్ ముసలారెడ్డి, పెద్ద ఎత్తున ఆదివాసీలు పాల్గొన్నారు.
ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్


