ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రం శనివారం భక్తజనులతో పులకించింది. మండుతున్న ఎండలను సైతం భక్తులు లెక్కచేయకుండా శ్రీవారి దర్శనార్ధం ఆలయ ఆవరణలో బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివెట్టి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట, నిత్యాన్నదాన సదనం తదితర విభాగాల్లో భక్తులు కిటకిటలాడారు. క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయ ఆవరణలో బారులు తీరారు. సామాన్య భక్తుల సౌకర్యార్ధం ఆలయ అధికారులు అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. క్యూలైన్లలోని భక్తులకు నిరంతరంగా వడ జావను, మంచి నీటిని అందించారు. దర్శనం టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, కేశఖండన టికెట్ల విక్రయాలు, విరాళాల ద్వారా శ్రీవారికి రూ. 40 లక్షలకు పైగా ఆదాయం లభించింది.


