స్పందన బాగుంది
జగన్ రాకతో మారిన స్కూళ్ల రూపులేఖలు
భీమవరం: పేద విద్యార్థులకు సైతం ఉత్తమ విద్య అందించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన విద్యా సంస్కరణలు నేడు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మనబడి, నాడు–నేడు పథకాలతో ప్రభుత్వ పాఠశాలు ఆధునిక హంగులతో రూపుదిద్దుకోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించేందుకు మొగ్గు చూస్తు న్నారు. గతంలో ఇంగ్లీష్ పదాలు రావాలంటే కేవలం ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలోనే సాధ్యమని తల్లిదండ్రులు భావించే వారు. దీనికితోడు ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, ఇంగ్లీషు మీడియం బోధించకపోవడంతో పేదవర్గాలు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించేవారు. విద్యకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిరావడంతో ఒక్కరే ముద్దు, ఇద్దరు వద్దు అంటూ ఒక్కొక్క సంతానంతో సరిపెట్టుకున్నారు.
సత్తా చాటుతున్న విద్యార్థులు : వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన విద్యాసంస్కరణలతో గత రెండేళ్లుగా టెన్త్ పబ్లిక్ పరీక్షలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటుతూ ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా మార్కులు సాధిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలో 1,366 ప్రభుత్వ పాఠశాలలకు గాను 1,096 ప్రైమరీ, 38 అప్పర్ప్రైమరీ, 232 హైస్కూళ్లు ఉన్నాయి. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రగతిని వివరించడంతో సుమారు 4,979 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే నూతన విద్యాసంవతర్సంలో మరింతమంది విద్యార్థులు చేరే అవకాశాలున్నాయి.
బడి పిలుస్తోంది కార్యక్రమానికి స్పందన బాగుంది. జిల్లాలోని ఉపాధ్యాయులు వారి స్కూళ్ల పరిధిలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రగతి వివరించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ఆశక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 87,857 మంది విద్యార్థులు ఉండాలని లక్ష్యానికిగాను ఇప్పటివరకు 93 శాతం ప్రగతిని సాధించాం. స్కూళ్లు ప్రారంభించేనాటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధిస్తామనే నమ్మకముంది.
– ఇ నారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి
జగన్ ప్రభుత్వంలో నాడు–నేడు, మనబడి పథకంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి
సత్ఫలితాలు ఇస్తున్న నాటి విద్యాసంస్కరణలు
ఇంగ్లీష్ మీడియం ప్రవేశంతో నేడు టెన్త్లో అత్యుత్తమ ఫలితాలు
ఈ ఏడాది ప్రభుత్వ బడుల్లో 4,979 మంది చేరిక
వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ విద్యపై ప్రత్యేక దృష్టిపెట్టారు. రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలను మనబడి, నాడు–నేడు పధకంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పూర్తిస్థాయి మౌలిక వసతులతోపాటు ల్యాబ్లను ఏర్పాచేయించారు. అంతేగాకుండా ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరిగా ఉండేవిధంగా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు ఉచిత భోజనంతోపాటు నాణ్యమైన స్కూల్ బ్యాగ్లు, పుస్తకాలు వంటి విద్యాసామగ్రిని అందించారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేవిధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మరెన్నో సంస్కరణలు అమలుచేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మారింది.


