తాడేపల్లిగూడెం: నియోజకవర్గంలోని వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాల మధ్య ప్రతిపాదించిన ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించిన స్థలాలను గురువారం ప్రీ పీజీబిలిటీ స్టడీ నిమిత్తం వచ్చిన ఎయిర్పోర్టు అఽథారిటీ ఆఫ్ ఇండియా చైన్నెకు చెందిన ప్రాంతీయ కార్యాలయ ఆరుగురు సభ్యుల బృందం పరిశీలించింది. మల్టీ డిసిప్లినరీ బృందంలోని సభ్యులు వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాల్లో భూములను పరిశీలించారు. భౌగోళిక పరిస్థితులు, భూసేకరణకు అనుకూలత, రవాణా అనుసంధానం, వాతావరణ పరిస్థితులు, భవిష్యత్ విస్తరణ అవకాశాలు, సమీప ప్రాంతాల్లో ఎత్తయిన నిర్మాణాలు, హైటెన్షన్ లైన్లు వంటి సాంకేతిక అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేశారు. ప్రాఽథమిక సమాచారం, భూభాగ స్వరూపం, పరిసర గ్రామాల పరిస్థితులు, కనెక్టివిటీ, రహదారి సదుపాయాలపై కూడా పరిశీలనలు చేశారు.
భీమవరం: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 41 పరీక్షా కేంద్రాల్లో ఉదయం జరిగిన మొదటి ఏడాది జనరల్ పరీక్షకు 2,761 మంది విద్యార్థులకు 2,545 మంది హాజరుకాగా ఒకేషనల్ పరీక్షకు 261 మందికి 221 మంది హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం జనరల్ పరీక్షకు 1,220 మందికి 1,046 మంది, ఒకేషనల్ పరీక్షకు 141 మందికి 122 మంది హాజరైనట్లు ఇంటర్ విద్యా శాఖ జిల్లా అధికారి ప్రభాకరరావు తెలిపారు.
ఆగిరిపల్లి: మండలంలోని చొప్పరమెట్లకు చెందిన పోలగాని నాగేశ్వరమ్మ (55) వడదెబ్బ తగిలి మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం నాగేశ్వరమ్మ ఎప్పటిలాగానే సగ్గూరు చెరువు వద్ద గేదెలు మేపడానికి వెళ్లింది. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుం సభ్యులు వెతకగా చెరువు సమీపంలో పొలాల వద్ద ఆమె విగతజీవిగా పడి ఉంది. గేదెలు మేపడానికి వెళ్లిన ఆమె వడదెబ్బ తగిలి మరణించడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నాగేశ్వరమ్మకు ఇరువురు కుమారులు ఉన్నారు.
ఏలూరు రూరల్ : ఈ నెల 21న ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో చేపట్టాల్సిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు వాయిదా వేశామని డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. కొద్దిరోజులుగా జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే అథ్లెట్లు ఇబ్బందులు పడకుండా పోటీలు వాయిదా వేశామని వివరించారు. త్వరలో జిల్లా అథ్లెటిక్స్ కోచ్ జి.కృష్ణకుమారి, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి ప్రసాద్తో చర్చించి తదుపరి పోటీల నిర్వహణ తేదీ వెల్లడిస్తామన్నారు.
ఏలూరు(ఆర్ఆర్పేట): నిధులు కేటాయించకుండా వచ్చే రెండేళ్ల కాలంలో రాష్ట్రంలోని 36 ప్రాజెక్టులు పూర్తి చేయడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతని ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని, నిధులు లేకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. 36 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. గురువారం ఏలూరులో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చిన్న,మధ్య తరహా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని లక్ష్యం ప్రకటించడం సరిపోదని, అందుకు అవసరమైన కార్యాచరణ ఉండాలన్నారు. ఏలూరు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి జిల్లాలకు ఎంతో ఉపయోగకరమైన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు.
ఏలూరు(ఆర్ఆర్పేట): ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం పంచాయతీ మాదేపల్లిలో జరుగుతున్న జనగణన కార్యక్రమంలో ఇళ్ల గణనను కలెక్టర్ కె.వెట్రిసెల్వి గురువారం తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్లగణనను సచివాలయ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. వేడి గాలుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో అవసరమైన మేర చలివేంద్రాలు ఏర్పాటుచేయాలన్నారు.


