కాళ్ల: ఆక్వా రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తుందని ఆ పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నరసింహరాజ అన్నారు. పెదఅమిరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రొయ్య మేత ధరలు కిలోకి రూ.10 పైన ఒకేసారి పెంచడం వల్ల ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో రొయ్య మేత ధర పెంచాలంటే ఆక్వా అధారిటీ కమిటీ ఏర్పాటు చేసి రైతులతో, ఆక్వా ఫీడ్ తయారుదారులతో మాట్లాడి అందరి అనుమతితో ఒక నిర్ణయం తీసుకునేవారని చెప్పారు. జగన్ పాలనలో ఐదేళ్లలో ఇంత పెద్ద ఎత్తున రేట్లు పెరగటం ఎప్పుడు జరగలేదని గుర్తు చేశారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో కూడా రొయ్య ధరలు తగ్గినప్పుడు రొయ్య ఎగుమతిదారులతో మాట్లాడి ఆక్వా రైతులకు మద్దతు ధర కల్పించేలా కృషి చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు కరెంట్ సబ్సిడీ ఇస్తామని, ఆక్వా రైతులను ఆదుకుంటామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు రైతులను నట్టేట ముంచుతుందని అసహనం వ్యక్తం చేశారు. ఉండి నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఆక్వాకల్చర్ సాగవుతుందన్నారు. డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామ కృష్ణంరాజు రైతులపై దృష్టి పెట్టి గుళ్లు, మైకులు సమస్యలపై కాకుండా కాకుండా రొయ్య మేత ధరల పరిస్థితిపై మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రితో మాట్లాడి ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేనిపక్షంలో వైఎస్సార్ సీపీ ఆక్వా రైతుల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పెన్మెత్స దుర్గాప్రసాద్రాజు, ఆకివీడు జెడ్పీటీసీ వేగేశ్న వెంకటరాజు, ఆకివీడు రైతులు పెన్మెత్స ఆంజనేయరాజు, రాజేష్, నాయకులు అంబటి రమేష్, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నరసింహరాజు


