ఏలూరు (టూటౌన్): అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందజేయనున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యన్.శ్రీలక్ష్మి తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యన్.శ్రీలక్ష్మి శనివారపుపేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని, శ్రీరామనగర్ ఆరవరోడ్డులోని సైనిక వెల్ఫేరు ఆఫీసు నందు ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్ను, జిల్లా కారాగారాన్ని గురువారం సందర్శించారు. శనివారపుపేటలోని బాలుర వసతి గృహంలో బాలలకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, మంచినీటి సౌకర్యం, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అలాగే అబ్జర్వేషన్ హోమ్లోని బాలలకు ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. తదనంతరం శ్రీరామనగర్ 6వ రోడ్డులోని సైనిక సంక్షేమ కార్యాలయము నందు ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినికల్ను సందర్శించి, క్లినిక్ పనితీరు మాజీ సైనికులకు అందుతున్న న్యాయ సహాయంపై అడిగి తెలుసుకున్నారు. అలాగే జిల్లా కారాగారంలోని ఖైదీలకు అందుతున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.


