ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయులను వేసవి సెలవుల్లో కూడా పనిచేయిస్తున్న పరిస్థితి కనపడుతోందని, ఉపాధ్యాయులతో పూర్తి స్థాయిలో పనిచేయించాలనే ఉద్దేశ్యం ఉంటే నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్గా మార్చి సంపాదిత సెలవులను పెంచాలని జాక్టో నాయకులు కోరారు. ఈమేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మను కలిసి వినతిపత్రం సమర్పించారు. రెమిడియల్ తరగతుల నిర్వహణకు హాజరౌతున్న ఉపాధ్యాయులకు, బడి పిలుస్తోందిలో భాగంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వేసవి తీవ్రత కూడా 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న దృష్ట్యా శిక్షణ తరగతులు వాయిదా వేయాలని, సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ అర్హత నిబంధనను రద్దు చేయాలని, మున్సిపల్, ఎయిడెడ్, ఎంటీఎస్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జాక్టో నాయకులు పువ్వుల ఆంజనేయులు, బూక్యా రాము, టీఎల్ఎస్ఎన్ మూర్తి, తోట ఎడ్వర్డ్, ఎం. రాంబాబు, డీఎస్ ప్రసాద్, ఈ. నారాయణ ఉన్నారు.


