వీరవాసరం : మండలంలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మండలంలోని మత్స్యపురి, బొబ్బనపల్లి, కొణితివాడ తదితర గ్రామాల్లో మట్టి తవ్వకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. వరి చేలలో మట్టిని తరలించుకోవాలంటే సీనరీజ్ను అందజేసి రెవెన్యూ అధికారులకు తెలియజేయాలి. ప్రభుత్వ అనుమతులు తీసుకుని మట్టిని తవ్వుకొని పనులు పూర్తి చేసుకోవాలి. అయితే అలాంటి పనులేమీ కట్టకుండానే సీనరీజిల్ని పన్నులను కట్టకుండానే స్థానిక గ్రామ రెవెన్యూ అధికారులను, రెవెన్యూ సిబ్బందిని మచ్చిక చేసుకుని మట్టి తవ్వకాలను పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. మట్టి ట్రాక్టర్లపై ఎలాంటి బరకాలను కప్పకపోవడంతో ఆ మట్టి రోడ్డుపై పడి ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరుతున్నారు. అయితే మట్టి తవ్వకాలపై తహసీల్దార్ ఏవీ రామాంజనేయులును వివరణ కోరగా మండలంలో మట్టి తవ్వకాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఎవరైనా మట్టి తరలిస్తే పొక్లెయిన్లను, ట్రాక్టర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు.


