కై కలూరు: వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానానికి ఫార్మర్ యాప్ ఒక నిదర్శనమని, ఇది రైతుల పాలిట వరంగా భావించాలని వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ షేక్ హబీబ్ బాషా చెప్పారు. మండలంలోని తామరకొల్లు, ముదినేపల్లి మండలం పెయ్యేరు గ్రామాల్లో ఫార్మర్ యాప్ ఉపయోగాలపై రైతులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫార్మర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. రైతులు తమ సాగు విస్తీర్ణం, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెట్ ధరలు ఎరువుల లభ్యత, పంట నష్టాలు, చీడపీడలపై అవగాహన, వ్యవసాయంపై సూచనలు సలహాలు ఇచ్చే ఏఐ అగ్రనమిస్ట్ వంటి సదుపాయాలు ఈ యాప్లో ఉన్నాయన్నారు. డౌన్లోడ్ చేసుకున్న రైతులందరూ కూడా ప్రతిరోజు యాప్లో లాగిన్ అయ్యి యాప్ ద్వారా అందే సమాచారాన్ని తెలుసుకుని ముందస్తుగా సాగు ప్రణాళికలు రూపొందించుకోవచ్చన్నారు. సాగు ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడులు పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో కై కలూరు ఇన్చార్జి ఏడీఏ ఎం.శ్రీనివాస్కుమార్, కై కలూరు, ముదినేపల్లి మండలాల వ్యవసాయధికారులు ఆర్.దివ్య, వేణుమాధవ్, వీఏఏ చింతా బింద తదితరులు పాల్గొన్నారు.


