పాలకొల్లు సెంట్రల్: ప్రభుత్వం, ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ ఆథారిటీ (అప్సడా)ని శాసించే స్థాయిలో రాష్ట్రంలో ఫీడ్ కంపెనీలు ఉన్నాయని రాష్ట్ర ఆక్వా సంఘం సభ్యులు ఆరోపించారు. బుధవారం పాలకొల్లులో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆక్వా రైతులతో మాట్లాడిన తర్వాతే ధరలు పెంచాలని ఫిషరీస్ కమిషనర్ చెప్పినా ఫీడ్ కంపెనీలు పట్టించుకోవడం లేదన్నారు. ఒకేసారి కిలోకు రూ.8 నుంచి రూ.10 వరకు పెంచడం దారుణమన్నారు. ఫీడ్ కంపెనీల ధోరణి చూస్తుంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు. గత ఫిబ్రవరిలో కిలోకు రూ.4 ధర పెంచినప్పుడే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రభుత్వానికి మొక్కుబడిగా సూచన చేసి కంపెనీలు ఇష్టారీతిలో ధరలు పెంచేశాయన్నారు. మంత్రి, అచ్చెన్నాయుడు, అప్సడా కమిషనర్కు తెలియకుండా ధర లు ఎలా పెంచారని ప్రశ్నించారు. ఫీడ్ ధరలు పెంచి రొయ్య కౌంట్ ధరలు తగ్గించేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారని, శుక్రవా రం విజయవాడలో ఆక్వా రైతు సంఘ నాయకులు, అప్సడా, ఫీడ్స్ కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారన్నారు. అనంతరం తమ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పారు. దీనిని కొందరు రాజకీయ కోణంలో చూస్తున్నారని, తాను టీడీపీ అభిమానిని అయినా ఆక్వా సాగు చేసి నష్టపోలేము కదా.. పంటకు గిట్టుబాటు ధర లేఖ ఫీడ్ కొనలేని పరిస్థితులు ఉంటే ఎలా ఊరుకుంటామని ఓ రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయ కమిటీ సభ్యు లు గొట్టుముక్కల గాంధీ భగవాన్రాజు, జీకేఎఫ్ సుబ్బరాజు, మళ్ల రాంబాబు, ఎం.వెంకట్రావు, బో ణం చినబాబు, మేడిది జాన్రాజు, పూసపాటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.


