ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాధ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీనివాసుని దివ్యకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ జరిగిన ఈ కల్యాణ తంతు భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లను పల్లకీ వాహనంలో ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం అట్టహాసంగా పల్లకీ వాహనాన్ని ఆలయ ఆవరణలోని కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. అంతక ముందే కల్యాణ మండపంలో విశేషంగా అలంకరించిన వేదికపై స్వామి, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఉంచి అర్చకులు పుష్పాలంకారాలు చేశారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ఆలయ ఈఓ వై.భద్రాజీ పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అర్చకులు, పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించి కల్యాణ తంతును ప్రారంభించారు. సుముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను భక్తుల గోవింద నామస్మరణల నడుమ వైభవంగా జరిపారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలను అందజేశారు.
లక్ష్మీపురంలో అట్టహాసంగా వేడుక


