కోల్కతా: రాజకీయ వేదికలపై కనిపించే కొన్ని దృశ్యాలు వైరల్గా మారుతుంటాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విషయంలో బెంగాల్ ఫైర్ బ్రాండ్ నేత సువేందు అధికారి చూపిన అనూహ్య భక్తిభావం, అణకువ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
పశ్చిమబెంగాల్లోని కొంటాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభ ఈ ఆసక్తికర ఘట్టానికి వేదికైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ ఇక్కడకు వచ్చారు. ఆయన వేదిక పైకి అడుగుపెట్టగానే సువేందు అధికారి వేగంగా వెళ్లి, కాషాయ కండువాతో స్వాగతం పలికారు. అంతేకాదు, ఏమాత్రం సంకోచించకుండా వేదికపైనే యోగి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. వెంటనే స్పందించిన యోగి ఆయనను ఆప్యాయంగా పైకి లేపి, చేయి పట్టుకుని అక్కడున్న ప్రజల వైపు తిరిగి అభివాదం చేశారు. ఈ క్షణాలను క్యాప్చర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ‘ఎంత భక్తో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Beautiful video ♥️
Kanthi, West Bengal : Bengal LoP Suvendu Adhikari seeks blessings from UP CM Yogi Adityanath by prostrating in-front him and touching his feet.#BengalElections #BJP4Bengal pic.twitter.com/eUj1lPdOe9— Amitabh Chaudhary (@MithilaWaaala) April 12, 2026
ఈ సభలో యోగి ఆదిత్యనాథ్ అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బెంగాల్ సంస్కృతిని, శాంతిభద్రతలను కాపాడటంలో టీఎంసీ సర్కార్ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, భద్రత కోసం ఇక్కడ కూడా నరేంద్ర మోదీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్, బీర్భూమ్ వంటి ప్రాంతాల్లో హిందువుల జనాభాను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బెంగాల్లో దుర్గాపూజ, రామ నవమి ఊరేగింపులను అడ్డుకోవడాన్ని యోగి తప్పుబట్టారు. బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.
ఇది కూడా చదవండి: Noida: కార్మికుల తిరుగుబాటు.. కలెక్టర్ కీలక నిర్ణయం!


