ఏలూరు (టూటౌన్): పట్టణంలోని సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని వన్ స్టాప్ సెంటర్ను గురువారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వన్ స్టాప్ సెంటర్ నిర్వహణ, ఆన్లైన్ ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం మొదలైన విషయాలను అడిగి తెలుసుకున్నారు, ఎక్కువగా గృహ హింస కేసులు నమోదు అవుతున్నాయని, అధికారులు ఎక్కువగా గృహ హింస కేసులు నమోదు అయ్యే ప్రాంతాలలో అవగాహన సదస్సును నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సెంట్రర్ అడ్మిన్ నిర్మల, స్టాండింగ్ కౌన్సిల్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: పురుగుల మందు తాగిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వివరాల ప్రకారం కొయ్యలగూడెం మండలం రాజవరానికి చెందిన ఎ.నాగరాజు(30) ద్వారకాతిరుమల మండలం సీహెచ్ పోతేపల్లిలోని ఓ రైతు వద్ద కమతం ఉంటున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ నాగరాజు గత మంగళవారం పురుగుల మందు తాగాడు. అప్పటి నుంచి ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు లేకపోవడంతో పోలీస్టేషన్లో కేసు నమోదు కాలేదు.


