బ్యాంకు ఉద్యోగుల సమ్మె
భీమవరం: బ్యాంకుల్లో 5 రోజుల పని దినాల అమలు జాప్యంపై నిరసనలో భాగంగా యుఎఫ్బీయు పిలుపు మేరకు మంగళవారం భీమవరం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద సమ్మె నిర్వహించారు. 2024 మార్చిలో 5 రోజుల పనిదినాలకు ఐబీఏ సూత్రప్రాయంగా అంగీకరించినా దానిని అమలుచేయడంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోందని ఎస్బీఐ ఎస్యూఏసీ రీజియన్ 6 సెక్రటరీ కె.బాలదుర్గాప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. 5 రోజుల బ్యాంకింగ్ విధానం అమలుచేసే వరకు దశల వారీగా ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రీజినల్ సెక్రటరీ జి.రామకృష్ణ, ఏబీసీ సెక్రటరీ వీవీ ప్రకాష్, యూబీఐ రీజనల్ సెక్రటరీ అమర్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆగిరిపల్లి: శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం సమయంలో అశ్లీల నృత్యాలు ప్రదర్శించడంపై గ్రామ ప్రజలతో పాటు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి సన్నిధిలోనే అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేయడం ద్వారా పవిత్ర రథోత్సవ గౌరవాన్ని దిగజార్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి సంవత్సరం రథోత్సవం సందర్భంగా భక్తి గీతాలు, కోలాటం, సంప్రదాయ నృత్యాలు, హరికథలు ఆనవాయితీ. సోమవారం ఉదయం జరిగిన రథోత్సవంలో ఈ సంప్రదాయాలకు విరుద్ధంగా అశ్లీల నృత్యాలు వేయించడంతో భక్తులు నివ్వెరపోయారు. దేవుడి దర్శనం కోసం మహిళలు, వృద్ధులు, చిన్నారులు వేచి చూస్తున్న వేళ ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. ఇన్నేళ్ల చరిత్రలో ఇలా ఎప్పుడూ లేదని.. ఇది కొత్త సంప్రదాయమా.. లేక అధికార బలంతో కొత్త సంస్కృతిని తీసుకువచ్చారా అంటూ చర్చ జరుగుతోంది. నిర్వాహకులంతా అధికార పార్టీకి చెందిన టీడీపీ నాయకులే కావడంతో ఇష్టానుసారంగా వ్యవహరించారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎస్సై శుభశేఖర్ వెంటనే రథోత్సవ ప్రాంగణానికి చేరుకుని అశ్లీల నృత్యాలు వేస్తున్న యువతులను ట్రాక్టర్పై నుంచి కిందకు దించి అక్కడి నుంచి పంపించారు.
ఏలూరు (టూటౌన్): కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ ఎంపిక చేసిన న్యాయవాదులకు 5 రోజులపాటు అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ నెల 27 నుండి 31 వరకు మధ్యవర్తిత్వంపై శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు. రాజీయోగ్యమైన కేసులలో ఇరుపక్షాలకు మధ్యవర్తిత్వం నిర్వహించి త్వరితగెత్తిన పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రెండో అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, పర్మినెంటు లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ.మేరీ గ్రేస్ కుమారి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంటు కొనే సీతారాం తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు(మెట్రో): రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సు ఈ నెల 30, 31 తేదీలలో ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన శాఖాధికారి సాజా నాయక్ ఒక ప్రకటనలో తెలి పారు. ఈ నెల 30న ఉదయం ఏలూరు చింతలపూడి రోడ్డులోని బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాలులో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, 31 వరకు జరుగుతుందన్నారు. కోకో సాగు విస్తరణ అభివృద్ధి, నాణ్యత ప్రమాణాలు, ప్రాసెసింగ్, కోకో సాగులో భాగస్వామ్యం, రైతులకు సలహాలు, ఆధునిక సాగు విధానాలు–సాంకేతిక పరిజ్ఞానం, అధిక ఉత్పత్తి, నాణ్యత పెంపుపై అవగాహన, అంతర్జాతీయ మార్కెటింగ్ అనుసంధానం వంటి అంశాలపై విస్తృతంగా చర్చిస్తామన్నారు.
బ్యాంకు ఉద్యోగుల సమ్మె
బ్యాంకు ఉద్యోగుల సమ్మె


