ఖర్చు అరకోటి.. స్వచ్ఛత మాటేంటి?
మెషీన్లు ఎక్కడా..
గత ప్రభుత్వంలో అలా.. ఇప్పుడిలా..
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో పారిశుద్ధ్యం పేరుతో శ్రీవారి సొమ్ము దోపిడీకి గురౌతోంది. పారిశుద్ధ్యం, ఇతర ఖర్చులు గతేడాది కంటే మూడు రెట్లు పెరిగినా.. స్వచ్ఛత మాత్రం కానరావడం లేదు. ఆలయ పరిసరాలు, శిల్ప సంపద దుమ్మూ, దూళితో కళావిహీనంగా మారాయి. దాంతో భక్తులు విస్తుపోతున్నారు. అయినా దేవస్థానం అధికారుల్లో ఏమాత్రం చలనం లేకపోవడం శోచనీయం. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల దివ్య క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తుంటారు. శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు దేవస్థానం పారిశుద్ధ్య పనులకు నెలకు లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తోంది. ఈ క్రమంలోనే 2022 అక్టోబర్ 1 నుంచి, ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పారిశుద్ధ్య పనులు నిర్వహించిన మంగళగిరికి చెందిన సెవెన్ హిల్స్ ఫెసిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి నెలకు రూ.18.28 లక్షలు చెల్లించారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఈ పారిశుద్ధ్య, ఇతర (ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఏసీ మెకానిక్, కార్పెంటర్, మేషన్) పనులను పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (తిరుపతి) సంస్థకు నెలకు సుమారు రూ.54 లక్షలకు అప్పగించారు. గత కాంట్రాక్టులో మొత్తం 132 మంది పనిచేయగా, ప్రస్తుత కాంట్రాక్టులో 200 మంది వరకు పనిచేస్తున్నారు. అయినా గతంతో పోలిస్తే.. పారిశుద్ధ్యం మెరుగుపడకపోగా మరింత అధ్వానంగా మారింది.
కళావిహీనంగా..
శ్రీవారి ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని దీపారాధన మండపం పొగపట్టి నల్లగా మారింది. యంత్రాలతో శుభ్రం చేయాల్సిన పారిశుద్ధ్య సిబ్బంది కానరావడం లేదు. భక్తులు, గోవింద దీక్షాదారులు మండపాన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే అనివేటి మండపంలోని దశావతారాలు, ఇతర శిల్ప సంపద దుమ్మూ, దూళి పట్టి కళావిహీనంగా మారాయి. శ్రీవారి పాదుకా మండపం వద్ద ఉన్న స్వామివారి కల్యాణ మండపంలోని శిల్పాలు మురికిపట్టి చూడడానికి ఎబ్బెట్టుగా ఉన్నాయి. శివాలయం ఘాట్ రోడ్డులో, ఇతర ప్రదేశాల్లో చెత్తా, చెదారం దర్శనమిస్తోంది.
జీతాలు ఇవ్వండి మహాప్రభో
కాంట్రాక్టర్ కార్మికులకు గడచిన నెల వేతనాలను ఇప్పటి వరకు ఇవ్వలేదు. దాంతో జీతాలు ఇవ్వండి మహాప్రభో.. అంటూ కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. ఇదిలా ఉంటే గడచిన నెల బిల్లును ఇప్పటి వరకు కాంట్రాక్టర్ దేవస్థానానికి సమర్పించలేదని, అందుకే కార్మికులకు వేతనాలు అందలేదని తెలుస్తోంది.
పొగపట్టి నల్లగా మారిన శ్రీవారి దీపారాధన మండపం
కొండపైన శివాలయం ఘాట్ రోడ్డులో చెత్తా, చెదారం
అనివేటి మండపంలో దుమ్ముతో కళావిహీనంగా మారిన నరసింహ, మత్స్యావతార శిల్పాలు
టెండర్ షరతుల ప్రకారం కాంట్రాక్టర్ వాటర్ జెట్ మెషీన్లు, సింగిల్ డిస్క్ స్రబ్బర్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, వెట్ అండ్ డ్రై స్క్రబ్బర్ డ్రయర్లు, తదితర మెషీన్లతో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి. కానీ యంత్రాలతో పనులు చేస్తున్న దాఖలాలు లేవు. సోప్ ఆయిల్, ఫినాయిల్ ఇతర కెమికల్స్ నాసిరకమైనవి వినియోగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం కొబ్బరి చీపుర్లు కూడా ఇవ్వడం లేదని, ఏ పనిముట్టు అడిగినా వాయిదా వేస్తున్నారని కొందరు పారిశుద్ధ్య కార్మికులు వాపోతున్నారు. ప్రశ్నిస్తే పనిలోంచి ఎక్కడ తీసేస్తారోనని వారు భయపడుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో అధికారులు కాంట్రాక్టర్ తెచ్చిన మెటీరియల్స్ నాణ్యతను, పరిమాణం, ఐఎస్ఐ మార్క్ను పరిశీలించేవారు. కానీ ఇప్పుడవేమీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
శ్రీవారి క్షేత్రంలో కానరాని పరిశుభ్రత
గత ప్రభుత్వంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగిన వ్యయం
కాంట్రాక్టర్ సీఎం బంధువు కావడంతో అధికారులూ గప్చుప్
మెషీన్లతో జరగని పనులు.. టెండర్ షరతుల ఉల్లంఘన
కార్మికులకు నేటికీ అందని గత నెల వేతనాలు
గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పారిశుద్ధ్య టెండర్ల నిర్వహణను ఆలయ అధికారులకే అప్పగించారు. దాంతో ఆలయ ఆదాయ, వ్యయాలను బట్టి ఏ ఆలయానికి ఆ ఆలయంలో అధికారులు టెండర్లను ఇచ్చారు. అయితే ప్రస్తుత చంద్రబాబు సర్కారు పారిశుద్ధ్యం హైజనిక్గ్గా ఉండాలన్న సాకుతో రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు సంబంధించిన టెండర్ ప్రక్రియను రాష్ట్ర దేవాదాయశాఖ కార్యాలయంలో నిర్వహించింది. 2015 నుంచి 2019 వరకు అన్ని ప్రముఖ ఆలయాల్లో పారిశుద్ధ్య, ఇతర పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ భాస్కరనాయుడికే మళ్లీ ఈసారి కాంట్రాక్టులను అప్పగించారు. చంద్రబాబు బంధువు కాబట్టే ఆయనకు మళ్లీ కాంట్రాక్టులు దక్కాయన్న ఆరోపణలున్నాయి. అందుకే పారిశుద్ధ్య లోపాలపై అధికారులు నోరు మెదపలేక పోతున్నారని భక్తులు, గ్రామస్తులు వాపోతున్నారు.
ఖర్చు అరకోటి.. స్వచ్ఛత మాటేంటి?
ఖర్చు అరకోటి.. స్వచ్ఛత మాటేంటి?
ఖర్చు అరకోటి.. స్వచ్ఛత మాటేంటి?
ఖర్చు అరకోటి.. స్వచ్ఛత మాటేంటి?


