
షాపు అద్దెల మాయాజాలం
రూ.45 వేల అద్దెను రూ.18 వేలకు కుదించి..
ఏలూరు చందనా బ్రదర్స్ సెంటర్లోని కస్తూరిబా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్లోని నెం.2 షాపు కేటాయింపు కూటమి నేతల అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ షాపు 15 ఏళ్లుగా టీడీపీ నేత మామిళ్లపల్లి పార్థసారథి పేరున నెలకు రూ.45 వేల అద్దైపె ఉంది. పార్థసారథి కీలక నేత కావడంతో కొత్త అంశానికి తెరతీశారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ షాపును ఖాళీ చేసి మరలా వేలం వేసేలా పావులు కదిపారు. ఈనెల 17న బహిరంగ వేలంలో ముగ్గురు టెండర్లు వేశారు. అయితే వీరంతా సదరు నేత కుమారుడు, అనుయాయులు కావడం విశేషం. హెచ్చు మొత్తం నెలకు రూ.18 వేల అద్దెకు టెండర్ వేసిన మామిళ్లపల్లి నందగోపాల్కు షాపును కేటాయించారు. ఇలా షాపును తండ్రి పేరు నుంచి కుమారుడికి బదలాయించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం నెలకు రూ.49,065 అద్దె నిర్ణయించగా రూ.18 వేల కే ఖరారు చేయడం ద్వారా కార్పొరేషన్ ఆదాయానికి నెలకు రూ.31,065 గండి పడింది. మున్సిపల్ చ ట్టం ప్రకారం ఉన్న అద్దె కన్నా ఎక్కువకే టెండర్ ఖరారు చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు.
ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని మున్సిపల్ కాంప్లెక్స్ల్లోని దుకాణాల్లో అద్దెల మాయాజాలం నడుస్తోంది. డిమాండ్ ఉన్న షాపులను కూటమి నాయకులు, వారి అనుచరులు అయినకాడికి అందుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షాపుల అద్దె పెరిగిన సందర్భాల్లో గుట్టుచప్పుడు కాకుండా వాటిని ఖాళీ చేయించి, మరలా బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. ఇలా వేలం నిర్వహించిన సందర్భాల్లో తమ కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల పేర్లతో షాపులను దక్కించుకుంటున్నారు. దీంతో ఏలూరు కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ‘వడ్డించే వాడు మనవాడైతే’ అన్న చందంగా షాపుల కేటాయింపులు జరుగుతున్నాయి.
746 షాపులు.. రూ.4.80 కోట్లు
కార్పొరేషన్ పరిఽధిలో 746 షాపులు ఉండగా ప్రస్తుతం 125 ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 621 షాపులు అద్దెకు నడుస్తున్నాయి. ఏటా షాపు అద్దెల రూపంలో కార్పొరేషన్కు రూ.4.80 కోట్ల ఆదాయం సమకూరుతుంది.
మూడేళ్లకోసారి 33 శాతం పెంచేలా..
మున్సిపల్ కాంప్లెక్స్లోని షాపులకు ప్రతి మూడేళ్లకోసారి 33 శాతం అద్దె పెంచాలి. దీనికి 18 శాతం జీఎస్టీ అదనం. అలాగే షాపు పాడుకున్న వ్యక్తి రెన్యూవల్ చేయించుకోవాలి. షాపు సర్వే నంబర్లను బట్టి కంప్యూటర్లో ఆటోమేటిక్గా అద్దెల పెంపుదల జరుగుతుంది. అయితే ఇక్కడ కార్పొరేషన్ సిబ్బంది మాయాజాలం కారణంగా కంప్యూటర్లను కూడా మేనేజ్ చేసేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. షాపుల కేటాయింపులో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, ఓసీ కేటగిరీల వారీగా అద్దెలు నిర్ణయిస్తారు. షాపుల అద్దెలు సైతం సర్వే నంబర్ల ఆధారంగా వేర్వేరుగా ఉంటాయి. బిర్లా భవన్ సెంటర్లోని మూడు వైపులా ఉన్న మున్సిపల్ షాపుల్లో మూడు రకాలుగా అద్దెలు ఉండటమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.
ప్రజాప్రతినిధి అనుచరుడికి రెండు షాపులు
ఇటీవల ఓ మున్సిపల్ కాంప్లెక్స్లో బేకరీ, హోటల్ షాపులు ఖాళీ అయ్యాయి. వీటిని ప్రజాప్రతినిధి అనుచరుడికి కేటాయించినట్టు తెలిసింది. సదరు వ్యక్తి ఆ రెండు షాపులను సబ్ లీజుకు ఇచ్చేశారు. ఇదే ప్రజాప్రతినిధి మరో అనుచరుడు ఒకరు ఏకంగా మున్సిపల్ ఆఫీస్ గోడను పగులగొట్టి బిర్యానీ పాయింట్ రూమ్ను లోపలకు విస్తరించారు. అయినా కార్పొరేషన్ అధికారులు ఏ ఒక్కరూ నోరు మెదపకపోవడం విశేషం.
మద్యం షాపు ఏర్పాటుపై విమర్శలు
బిర్లాభవన్ సెంటర్ నుంచి కల్పనా థియేటర్కు వెళ్లే మార్గంలోని మున్సిపల్ కాంప్లెక్స్లోని రెండు షాపుల్లో మద్యం దుకాణం ఏర్పాటుచేయడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై మున్సిపల్ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు వెళ్లాయి. వేరే వారి పేరుతో ఉన్న ఆ రెండు షాపులను వైన్స్ షాపుదారుడికి సబ్ లీజుకి ఇచ్చినట్టు తెలిసింది. మున్సిపల్ కాంప్లెక్స్లలో మద్యం షాపులను ఏర్పాటు చే యకూడదనే నిబంధనలు ఉన్నా భేఖాతరు చేశారు.
ధనార్జనే కూటమి లక్ష్యం
కార్పొరేషన్ షాపుల అద్దెలు సగానికి కుదింపు
కూటమి నేతల అనుయాయులకే దుకాణాల కేటాయింపు
ఏలూరు నగరపాలక సంస్థ షాపులపై కన్ను
మున్సిపల్ నిబంధనలు పాటించని వైనం
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
మద్యం షాపు విడ్డూరం
మున్సిపల్ కాంప్లెక్స్లో ఏకంగా మద్యం షాపు ను ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎటువంటి చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యక్రమాలకు షాపులను అద్దెకు ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నా వాటిని భేఖాతరు చేస్తూ షాపులను కేటాయించడం బాధాకరం. దీనిపై మున్సిపల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.
– బి.సోమయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, ఏలూరు

షాపు అద్దెల మాయాజాలం