
ఏలూరు(మెట్రో): రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి అనేక కార్యక్రమాలు రూపొందించిందని, వాటిని వినియోగిస్తూ విద్యార్థులు ఉన్నత స్థాయిలో నిలిచేందుకు అధికారులు కృషిచేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. గురువారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని విద్యా శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. నాడు–నేడు పనుల పురోగతి, 2023–24లో పదోతరగతి విద్యార్థుల ఉత్తీర్ణత పెంపుదలకు చర్యలు, విద్యార్ధుల డ్రాపవుట్లు, మధ్యాహ్న భోజనం, పాఠశాలలో పారిశుధ్యం, బాలికలకు శానిటరీ నాప్కిన్న్స్ పంపిణీ వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యా శాఖాధికారులకు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి కేఎస్ఎస్ సుబ్బారావు, జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్.నిర్మల జ్యోతి, ఏలూరు జిల్లా విద్యా శాఖాధికారి పి.శ్యాం సుందర్, పశ్చిమ గోదావరి జిల్లా విద్యా శాఖాధికారి ఆర్ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
విద్యా శాఖపై జెడ్పీ చైర్పర్సన్ సమీక్ష