భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి సమగ్ర ప్ర ణాళికలు అమలు చేస్తున్నామని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. జిల్లాలోని తణుకులో 0.77 ఎకరాలు, తాడేపల్లిగూడెంలో 0.85 ఎకరాలు, ఉండి మండలంలో 0.81 ఎకరాల భూమిని టూరిజం అభివృద్ధికి వినియోగించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. భారీ, మెగా, అల్ట్రా మెగా టూరిజం ప్రాజెక్టులకు భూ ములు దీర్ఘకాలిక లీజు పద్ధతిలో కేటాయిస్తారని, వీటి వివరాలు టూరిజం అథారిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్టు చెప్పారు. జిల్లాకు చెందిన మూడు స్థలాలు ఉన్నాయని, ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడిదారులకు సౌలభ్యం కల్పించేందుకు ఏపీ టూరిజం అథారిటీ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని, మరిన్ని వివరాలకు జిల్లా టూరిజం అధికారిని లేక అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఆమె కోరారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో గృహ గణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా, సమయపాలనతో నిర్వహించేందు కు అధికారులు చర్యలు తీసుకోవాలని డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం ఆయన తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లాలోని ప్రతి మండలం, మున్సిపాలిటీలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, క్షేత్రస్థాయి సిబ్బందిని తక్షణమే ని యమించాలని ఆదేశించారు. ఈనెల 23, 24, 25 తేదీల్లో సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని, గృహ గణన ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా, కచ్చితమైన సమాచార సేకరణ జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రజలు కూడా సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించి సరైన సమాచారాన్ని అందించాలని కోరారు.
తాడేపల్లిగూడెం: అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న ఉద్యాన పంటల రైతులకు అండగా ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలు ఉంటారని ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు శుక్రవారం వి లేకరుల సమావేశంలో తెలిపారు. రాయలసీ మ జిల్లాల్లో, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉ ద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఉద్యాన వర్సిటీ నుంచి ఆయా ప్రాంతాలకు శాస్త్రవేత్తల బృందాలు సందర్శించి, రైతులకు యాజమాన్య పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన కల్పిస్తారన్నారు. అకాల వర్షాల వల్ల అరటి, మామిడి, బొప్పాయి, కర్బుజా, దాని మ్మ, కూరగాయల పంటలు, పూల మొక్కలు పాడైపోయే అవకాశాలు ఎక్కువన్నారు. ఉద్యా న పంటల సాగులో ఏఐ ప్రాధాన్యత, హార్టీ వి ద్య వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. రిజిస్ట్రార్ ఎం.మాధవి, బి.ప్రసన్నకుమార్, జి.రామానందం, సీహెచ్.రూత్ పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: గోవును పూజించినా.. గోవుకు సేవించినా.. సకల శుభాలు కలుగుతాయని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఉద్బోధించారు. ఒంగోలు, పుంగనూరు గోజాతి సంక్షేమ సంఘం, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ–రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, దాతల సౌజన్యంతో ద్వారకాతిరుమల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన గోవుల అందాలు, పాల పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. గో పోషకులతో మాట్లాడి, గో విశిష్టత ను తెలియజేశారు. అనంతరం అనుగ్రహ భా షణం చేశారు. గోవులో ముక్కోటి దేవతలు ఇమిడి ఉంటారని, ప్రతిఒక్కరూ గోవులను ఆ రాధించాలన్నారు. ఇక్కడ నిర్వహిస్తున్న గో అందాలు, పాల పోటీలు ఉన్నతమైనవన్నారు. సనాతన ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవడంలో గోసంరక్షణ ముఖ్యమైందన్నారు. గోశాలలను ప్రోత్సహించడం ద్వారా జీవన విధానంలో మార్పు, దైవత్వాన్ని ఆస్వాదించవచ్చన్నారు. ఇదిలా ఉంటే ఈ పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుంచి ఇప్పటివరకు 91 పుంగనూరు, ఒంగోలు ఆవులు, గిత్తలు పాల్గొన్నాయి.


