సాక్షి, వరంగల్: చాలారోజుల తర్వాత జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలోని 11 మండలాల్లో మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు 15.6 నుంచి 64.4 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. దీంతో వ్యవసాయం చేసే రైతులకు కొంత ఊరట లభించింది. చెన్నారావుపేట మండలంలో అత్యధికంగా 54.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట, ఖానాపురం, నెక్కొండ, పర్వతగిరి, సంగెం, గీసుకొండ, వరంగల్, ఖిలా వరంగల్ మండలాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో చెరువులు, కుంటలకు కొంత మేరకు నీటి ప్రవాహం చేరగా, సాగు పంటలకు తేమ లభించినట్లయింది. మరోవైపు రాయపర్తి, వర్ధన్నపేట మండలాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు కురిశాయి. ఈ రెండు మండలాల్లో 2.5 నుంచి 15.5 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగ అధికారులు తెలిపారు.
కాస్త ఉపశమనం
గత కొన్ని రోజులుగా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. అయితే, ఒకటి రెండు చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వరి, పత్తి, మొక్కజొన్న తదితర ఖరీఫ్ పంటలకు అనుకూలంగా ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు, చెరువులు పూర్తిస్థాయిలో నిండాలంటే మరికొన్ని రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవాల్సిన అవసరం ఉంది. వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
11 మండలాల్లో 15.6 నుంచి
64.4 మిల్లీమీటర్ల వర్షపాతం
వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో
తేలికపాటి వర్షం
వ్యవసాయ పంటలకు కాస్త ఊపిరి


