న్యూశాయంపేట: పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్య పరిరక్షణ కోసం వన్యప్రాణులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. బుధవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జువాలాజికల్ పార్కులో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా అటవీ శాఖ అధికారి ముకుందరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రకృతి వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈసందర్భంగా వన్యప్రాణుల సంరక్షణపై రూపొందించిన అవగాహన పోస్టర్లు ఆవిష్కరించారు. పులుల దినోత్సవాన్ని పురష్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓలు మయూరి, శిరీష, శ్రీనివాస్, శ్యామసుందర్, విద్యార్థులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్


