పోగుంటలు పెట్టేందుకు రైతులు సన్నద్ధం
● వరినాట్లపై వేచిచూసే ధోరణిలో అన్నదాతలు
● అదును దాటిన కాలం..
ఆరుతడి పంటలపై ఆలోచన
సాక్షిప్రతినిధి, వరంగల్: జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి మొదలైన ముసురు బుధవారం రాత్రి వరకు కొనసాగింది. రాష్ట్రంలో అత్యధికంగా – 75 శాతం లోటు వర్షపాతం ఉన్న జిల్లాలో ఒకే రోజు 25 శాతం లోటు తగ్గి –50 శాతానికి చేరింది. దీంతో చాలా రోజుల తర్వాత రోజంతా కొనసాగిన ముసురు వాతావరణం పత్తి రైతులకు ఊరటనిస్తోంది. ఈసీజన్లో వర్షాభావం కారణంగా అనేక ప్రాంతాల్లో విత్తనాలు మొలకెత్త లేదు. మొలకెత్తినా ఎండిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పత్తి పంట కోలుకునే అవకాశాలు కనిపిస్తుండడంతో రైతులు పోగుంటలు (మొలకెత్తని చోట మళ్లీ విత్తనాలు) పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో సాగు ఇలా..
జిల్లాలో మొత్తం సాధారణ సాగు 2,38,964 ఎకరాలు కాగా, బుధవారం నాటికి 1,17,857 (49 శాతం) ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు వేశారు. పత్తి 57,830 ఎకరాల్లో సాగై 53 శాతంగా నమోదు కాగా, వరి కేవలం 37,944 ఎకరాల (29 శాతం) వద్ద ఉంది. మొక్కజొన్న 6,026 ఎకరాల్లో సాగై సాధారణ లక్ష్యాన్ని దాటి 114 శాతానికి చేరగా, మిగిలిన విస్తీర్ణంలో సోయాబీన్, కంది, పెసర పంటలు వేశారు. కాగా, జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, ధర్మసాగర్, వేలేరు, హస న్పర్తి మండలాల్లో పత్తి ఎక్కువగా సాగైంది. తొలి దఫా విత్తిన పంటల్లో ఖాళీలు ఏర్పడిన పొలాల్లో రైతులు మళ్లీ విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఎరువులు, విత్తనాల దుకాణాల్లో పత్తి విత్తనాల కొనుగోళ్లు మళ్లీ మొదలయ్యాయి.
ఆరుతడి పంటలవైపు మొగ్గు
ఇప్పటికే విత్తనాలు, దుక్కి, కూలీలు, ఎరువుల కోసం భారీగా ఖర్చు చేసిన రైతులు ఇప్పుడు మరోసారి విత్తనాలు కొనాల్సి వస్తోంది. పత్తి విత్తనాలతో పాటు సూక్ష్మ పోషకాలు, కలుపు మందులు, ఎరువుల కొనుగోళ్లతో ఎకరాకు పెట్టుబడి మరింత పెరుగుతోందని రైతులు చెబుతున్నారు. అయినప్పటికీ పంటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో అదనపు ఖర్చుకు వెనుకాడడం లేదు. ఇదిలా ఉంటే జూలై నెల ముగింపు దశకు చేరుకోవడంతో ఇంకా విత్తని రైతులు అధికారుల ప్రచారం నేపథ్యంలో పత్తికి బదులుగా కంది, పెసర, జొన్న, సజ్జ వంటి ఆరుతడి పంటలను ఎంచుకుంటున్నారు. తక్కువ కాలంలో పండే అవకాశం, వర్షాలపై ఆధారపడే స్వభావం కారణంగా ఈ పంటల సాగుపై ఆసక్తి పెరుగుతోంది.
జిల్లా వ్యాప్తంగా వర్షం
అల్పపీడనం, వాయుగండం కారణంగా హనుమకొండ జిల్లాలో రెండు రోజులుగా మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షం వాడిపోతున్న మెట్ట పంటలకు జీవం పోసింది. బుధవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8 గంటల వరకు అటోమెటిక్ వెదర్ స్టేషన్లో నమోదైన వివరాలను రాష్ట్ర ప్రణాళిక శాఖ విడుదల చేసింది. రాష్ట్రంలోనే ములుగు జిల్లా ఏటూరునాగారంలో అత్యధికంగా 152 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ధ్రువీకరించిన విత్తనాలే వాడాలి..
ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటలు వేసుకోవడమే లాభదాయకం. పోగుంటలు చేపట్టే రైతులు ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే వినియోగించాలి. వర్షాల తర్వాత పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకొని, అవసరాన్ని బట్టి మాత్రమే ఎరువులు, సూక్ష్మపోషకాలు వేయాలి. మొక్కల పెరుగుదల దశను బట్టి తెగుళ్ల ఉధృతి పెరగకుండా చూసుకోవాలి.
– కె.ఆదిరెడ్డి, ఏడీఏ, హనుమకొండ
హసన్పర్తి
వేలేరు
దామెర
భీమదేవరపల్లి
ఎల్కతుర్తి
ఐనవోలు
కాజీపేట
ఆత్మకూరు
ధర్మసాగర్
కమలాపూర్
శాయంపేట
నడికూడ
హనుమకొండ జిల్లా సాగు గణాంకాలు (29.07.2026 నాటికి)
మండలం వర్షం(మి.మీ)
పంట సాధారణ సాగైన విస్తీర్ణం శాతం
సాగు విస్తీర్ణం ( ఎకరాల్లో.. )
పత్తి 1,09,570 57,830 53
వరి 1,47,977 37,944 26
మొక్కజొన్న 5,272 6,026 114
కంది 1,009 513 51
పెసర 157 227 145
మినుము 71 10 14
వేరుశనగ 82 25 30
11
11
11.5
11.8
11.8
12.3
12.5
14.5
14.5
19.8
22.3
3.8
సాధారణ వర్షపాతం: 391.0 మి.మీ.
నమోదైన వర్షపాతం: 193.7 మి.మీ.
లోటు : – 50 శాతం
బుధవారం సగటు వర్షపాతం: 31.9 మి.మీ.
బుధవారం సాధారణ వర్షపాతం: 7.8 మి.మీ.
బుధవారం వ్యత్యాసం: + 309 శాతం


