కమలాపూర్: కమలాపూర్ మండలం భీంపల్లికి చెందిన అరుకాల కుమారస్వామి (45) ప్రమాదవశాత్తు రోటోవేటర్ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడి మృతి చెందాడు. ఈఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అంకుషాపూర్ గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమారస్వామి కొన్నేళ్ల క్రితం జమ్మికుంటలోని దుర్గాకాలనీలో సొంతిల్లు కట్టుకొని నివసిస్తూ జమ్మికుంట, భీంపల్లిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలోనే బుధవారం కమలాపూర్ మండలం భీంపల్లి, జమ్మికుంట పరిధి అంకుషాపూర్ గ్రామాల పరిధిలో రోటోవేటర్ కొట్టి పనులు ముగించుకుని వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న కుమారస్వామి ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జమ్మికుంట పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ రామకృష్ణ తెలిపారు.


