గీసుకొండ: వనమహోత్సవంలో భాగంగా నాటడానికి నర్సరీలో పెంచుతున్న మొక్కలను సంరక్షించాలని డీఎఫ్ఓ నిఖిత అన్నారు. మచ్చాపూర్ నర్సరీలో మంగళవారం ఆమె మొక్కలను పరిశీలించి ఫారెస్టు అధికారులతో మాట్లాడారు. ఎండ తీవ్రతకు మొక్కలు ఎండిపోకుండా తగినంత నీరు పోయాలన్నారు. నర్సరీలోని మొక్కల వివరాలను, సంబంధించిన రికార్డులను ఆమె పరిశీలించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె.రాధిక, సెక్షన్ ఆఫీసర్ జగ్గయ్య, బీట్ ఆఫీసర్ సమ్మయ్య, టెక్నికల్ అసిస్టెంట్ సీహెచ్ రాజు, వనసేవక్ యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
పలువురికి ఎంపీడీఓలుగా పదోన్నతి
గీసుకొండ: జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో సూపరింటెండెంట్లుగా, మండల పంచాయతీ అధికారి(ఎంపీఓ)గా పనిచేస్తున్న పలువురికి ఎంపీడీఓలుగా తాత్కాలిక పద్ధతి(అడ్హక్)న పదోన్నతి కల్పించారు. ఈ మేరకు మంగళవారం పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ డి.దివ్య పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి. గీసుకొండ ఎంపీఓగా పనిచేస్తున్న పాక శ్రీనివాస్కు ఎంపీడీఓగా పదోన్నతి కల్పించి ఇదే జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. అలాగే, నర్సంపేట ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ వి.ప్రవీణ్కుమార్ను ఎంపీడీఓగా పదోన్నతి కల్పించి ములుగు జిల్లాకు పోస్టింగ్ ఇచ్చారు. సూపరింటెండెంట్ ఎస్.ఉదయ్భాస్కర్ను నిజామాబాద్ జిల్లాకు ఎంపీడీఓగా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. సూపరింటెండెంట్ పి.శ్రీదేవిని ఎంపీడీఓగా పదోన్నతి కల్పించి ఖమ్మం బదిలీ చేశారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజీనామా
నర్సంపేట రూరల్: నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిషన్ మంగళవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను డీఎంఈ, నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణికి అందించినట్లు కిషన్ తెలిపారు. ఇన్చార్జ్ సూపరింటెండెంట్ బాధ్య తలను జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ చంద్రశేఖర్కు అప్పగించినట్లు తెలిసింది.
పేకాట స్థావరంపై దాడులు
నర్సంపేట రూరల్ : పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్, నర్సపేంట పోలీసులు దాడులు చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, నర్సంపేట ఎస్సై గూడ అరుణ్ తెలిపారు. వారి కథనం ప్రకారం.. నర్సంపేట పట్టణ శివారు ప్రాంతంలో కొందరు వ్యక్తులు పేకాడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు టాస్క్ఫోర్స్, నర్సంపేట పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. 10 మంది పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేసి, వారి వద్ద నుంచి రూ.6,200 నగదు, 7 మొబైల్ ఫోన్లు, మూడు ద్విచక్రవాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. మరో నలుగురు పరారైనట్లు వివరించారు. టాస్క్ఫోర్స్ సీఐ బండారి రాజు, పి.దేవేందర్, ఎస్సై భానుప్రకాశ్, నర్సంపేట పోలీసులు పాల్గొన్నారు.


