● నర్సంపేట ఐబీ ఈఈ పి.సుదర్శన్రావు
నెక్కొండ: చెరువు మట్టిలో సాగు భూములకు కావాల్సిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయని నర్సంపేట ఐబీ ఈఈ పి.సుదర్శన్రావు అన్నారు. సాయిరెడ్డిపల్లి ఊర చెరువులో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పూడికతీత పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా సుదర్శన్రావు మాట్లాడుతూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలో దాదాపు 10 వేల క్యూబిక్ మీటర్ల చెరువు మట్టిని రైతుల పంట పొలాలకు తరలించినట్లు తెలిపారు. దీంతో రైతుల భూములు మరింత సారవంతమవుతాయని ఆయన పేర్కొన్నారు. చెరువు మట్టిలో మొక్కలకు కావాల్సిన నత్రజని, పొటాష్, జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయని ఆయన చెప్పారు. ఫలితంగా రసాయన ఎరువుల వినియోగం తగ్గుతుందని, నత్రజని మొక్క పెరుగుదలకు ఉపయోగపడగా.. పొటాష్ తెగుళ్లను తట్టుకునే శక్తినిస్తుందని ఆయన వివరించారు. చెలక భూములకు చెరువు మట్టి సేంద్రియ ఎరువుగా పనిచేస్తుందని పేర్కొన్నారు. పంట దిగుబడి, చెరువుల నీటి నిల్వ సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుందన్నారు. ఆయన వెంట డీఈ ఎస్.సంతోష్కుమార్, ఉపాధి హామీ కూలీలు, రైతులు తదితరులు ఉన్నారు.


