ఖిలా వరంగల్ : విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఫీజుల పేరిట దోచుకుంటున్న పలు కార్పొరేట్ విద్యాసంస్థలకు కొందరు అధికారులే అండగా నిలుస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ల్యాదల్ల శరత్ విమర్శించారు. వరంగల్ నగరంలోని శివనగర్లోని సీపీఐ కార్యాలయ ఆవరణలోని తమ్మెర భవనంలోని ఆ సంఘం కార్యాలయంలో అభిరామ్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశంలో శరత్ మాట్లాడారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే టెక్నో, డీజీ స్కూళ్ల పేర్లతో ఫ్లెక్సీలను విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపడుతున్నారని ఆరోపించారు. పలు రకాలుగా విద్యార్థులను, తల్లిదండ్రులను మభ్యపెడుతూ అడ్మీషనన్లు పెంచుకోవడమే లక్ష్యంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో సూర్య, వంశీ, శ్రావణ్, శ్రీకాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


