కేయూ క్యాంపస్ : నవయుగ వైతాళికుడు, చరిత్రకారుడు, తెలంగాణ సాహిత్యాభివృద్ధికి విశిష్టసేవలు అందించిన మహనీయుడు సురవరం ప్రతాప్రెడ్డి అని కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ చిర్ర రాజు కొనియాడారు. సురవరం ప్రతాప్రెడ్డి జయంతి వేడుకలను కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగంలో గురువారం నిర్వహించారు. తొలుత ప్రతాప్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురవరం ప్రతాప్రెడ్డి రచనలు నేటి తరానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు సమాజ చైతన్యానికి దోహదపడతాయని చెప్పారు. తెలుగు విభాగం అధిపతి డాక్టర్ మామిడి లింగయ్య మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక భాషా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడిగా సురవరం అని అన్నారు. కార్యక్రమంలో తెలుగు విభాగం అధ్యాపకులు డాక్టర్ కర్రె సదాశివ్, డాక్టర్ బానోతు స్వామి, డాక్టర్ నాగరాజ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.


