చెన్నారావుపేట : మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలోని పెద్ద చెరువులో అక్రమంగా మట్టి తరలింపు యథేచ్ఛగా కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రెండేళ్లుగా అక్రమార్కులు దందాకు పాల్పడుతున్నా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నట్టు పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రైతులు పొలాల్లో నల్లమట్టి పోసుకోవడానికి అనుమతి అధికారులు ఇవ్వడం లేదని, మొరం తరలింపును ఎలా అనుమతిస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. చెరువులో మొరం తీసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పీఏసీఎస్ చైర్మన్ చింతకింది వంశీ ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. రెవెన్యూ, ఐబీ, మైనింగ్ అధికారులకు రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదని ఆయన ఆరోపించారు.


