ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక పూజలు

May 27 2026 12:47 AM | Updated on May 27 2026 12:47 AM

గీసుకొండ: మండలంలోని ఊకల్‌హవేలిలోని ప్రసిద్ధ నాగ సుభ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఏకాదశి సందర్భంగా అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు, శ్రీహర్షలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. మల్లెపూలతో స్వామివారిని ‘పూజడ’ రూపంలో అలంకరించి భక్తులకు అభిషేకాలు, తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ తిమ్మాపురం రాజేశ్వర్‌రావు, కోశాధికారి కొత్తగట్టు రాజేందర్‌, భక్తులు పాల్గొన్నారు.

24 మంది గైర్హాజరు

కాళోజీ సెంటర్‌: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ప్రాక్టికల్‌ పరీక్షలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్‌ పేపర్‌లో మొత్తం 24 మంది గైర్హాజరు అయినట్లు వరంగల్‌ డీఐఈఓ డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం జనరల్‌, ఒకేషనల్‌ కోర్సులో 78 మంది విద్యార్థులకు 19 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 39 మందికి ఐదుగురు గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగాలి

న్యూశాయంపేట: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం వరంగల్‌ కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో అదనపు కలెక్టర్‌ జి.సంధ్యారాణి సంబంధిత అధికారులు, రైస్‌మిల్లర్స్‌తో రబీ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ధాన్యం దిగుమతిని వేగవంతం చేయడానికి తగిన సంఖ్యలో హమాలీలను నియమించాలని మిల్లర్లకు సూచించారు. అంతకుముందు జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి ట్యాబ్‌ ఎంట్రీలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పంట అవశేషాలు కాల్చొద్దు

దుగ్గొండి: రైతులు పంట పూర్తైన తర్వాత పంట అవశేషాలు కాల్చొద్దని ఇన్‌చార్జ్‌ జిల్లా వ్యవసాయ అధికారి, ఆత్మపీడీ విజయనిర్మల అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చడంతో సూక్ష్మ పోషకాలు నశించి భూమి వేడెక్కుతుందన్నారు. నేల ఆరోగ్యాన్ని కాపాడితేనే భవిష్యత్‌ తరాలను మనుగడ ఉంటుందన్నారు. అనంతరం రైతులకు జనుము, జీలుగ విత్తనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అఽధికారి శ్రీనివాసరావు, నర్సంపేట ఏడీఏ శ్రీనివాస్‌, డివిజన్‌ ఉద్యానశాఖ అఽధికారి జ్యోతి, మండల వ్యవసాయ అధికారి గాజుల శ్యామ్‌, ఏఈఓలు హన్మంతు, విజయ్‌నాయక్‌, రాజేష్‌, రైతులు పాల్గొన్నారు.

సత్ప్రవర్తనతో నడుచుకోవాలి

రాయపర్తి: రౌడీషీటర్లు గ్రామాల్లో పంచాయితీలకు వెళ్తూ బెదిరింపులకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో నడుచుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య హెచ్చరించారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రౌడీషీటర్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దని, ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా శిక్ష తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ కొమ్మూరి శ్రీనివాస్‌, వర్ధన్నపేట, జఫర్‌గఢ్‌, రాయపర్తి ఎస్సైలు సాయిబాబా, రా మారావు, ముత్యం రాజేందర్‌, బండి సుధాకర్‌, కానిస్టేబుళ్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement