దుర్గమ్మగుడి నిర్మాణానికి విరాళం | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మగుడి నిర్మాణానికి విరాళం

May 27 2026 12:47 AM | Updated on May 27 2026 12:47 AM

రాయపర్తి: మండలంలోని ఊకల్‌ గ్రామ పరిధిలోని టేకులతండాలో నిర్మిస్తున్న దుర్గమ్మగుడి నిర్మాణానికి తండావాసుల విజ్ఞప్తి మేరకు రూ.10వేలు అందించినట్లు లేతాకుల రంగా రెడ్డి తెలిపారు. ఎస్‌ఆర్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీని వాస్‌రెడ్డి పంపించిన నగదును తండావాసులకు మంగళవారం అందించినట్లు తెలిపారు. అలాగే కొండూరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన శాస్త్రబోయిన ముత్తమ్మ, పూస భారతమ్మ కుటుంబాలకు ఎస్‌ఆర్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బియ్యంతోపాటు ఆయిల్‌, ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. కార్యక్రమాల్లో ఫౌండేషన్‌ ప్రతినిధులు, నాయకులు పూస మధు, కర్ర రవీందర్‌రెడ్డి, ప్రసాద్‌, పుల్ల ఎల్లగౌడ్‌, దేశబోయిన ఉపేందర్‌, సోమన్న, ఆజ్మీరా నాగేందర్‌, కిషన్‌, హరిసింగ్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ సమస్యల

పరిష్కారానికి కృషి

ఖానాపురం: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సర్పంచ్‌ దాసరి రమేష్‌ అన్నారు. మండల కేంద్రంలో పలురోడ్ల మరమ్మతు పనులను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధి లో రోడ్లు గుంతలమయంగా మారడంతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో మరమ్మతు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ పరుచూరి సుబ్బారావు, ఉపసర్పంచ్‌ ఉప్పు రాజు, వార్డు సభ్యులు అజహర్‌, మల్లికార్జున్‌, శ్రీనివాస్‌రెడ్డి, గులాంబాబ, బోడ దేవ, నూర్‌ మహ్మద్‌, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

మక్కల డబ్బులు

జమచేయాలి

చెన్నారావుపేట: మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన మక్కల డబ్బులు వెంటనే రైతుల ఖాతాలో జమచేయాలని ఎంసీపీఐ(యూ) మండల కార్యదర్శి జన్ను రమేష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. రైతులు ఆరుకాలం కష్టపడి, అప్పులు చేసి పంట పండించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రలో విక్రయిస్తే నేటికీ డబ్బులు జమ చేయకపోవడం సరికాదన్నారు. మక్కలు కొనుగోలు చేసిన వారం రోజుల్లో డబ్బులు జమ చేయాల్సిన అధికారులు నెల రోజులు గడుస్తున్నా పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనన్నారు.

ఎన్నిక

రాయపర్తి: మండలకేంద్రానికి చెందిన ఎనగందుల శ్రావణ్‌కుమార్‌ బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రెండోసారి ఎన్నికై నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేష్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రావణ్‌కుమార్‌ గతంలో ఎన్నో విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నందున ఈ పదవి అప్పగించినట్లు తెలిపారు.

గొర్ల కొట్టం దగ్ధం

నర్సంపేట రూరల్‌ : నర్సంపేట మండలంలోని లక్నెపల్లి గ్రామ శివారు మర్రినర్సయ్యపల్లి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మొక్కజొన్న చేనుకు నిప్పంటించడంతో ఆ చేనును ఆనుకుని ఉన్న గాదెం సూరయ్య గొర్లకొట్టం పూర్తిగా దగ్ధమైంది. ఈప్రమాదంలో రూ. 20వేల నగదు, 2 గొర్రెలు, ఇతర సామగ్రి మొత్తం కలిపి రూ.లక్ష నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. బాధితుడు సూరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్‌ తెలిపారు.

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

శాయంపేట : 18 ఏళ్లలోపు ఆడ పిల్లలకు బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ ప్రవీణ్‌ కుమార్‌, ఎంపీడీఓ ఫణిచంద్ర అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు పుణ్యావతి, సునితారెడ్డి అధ్యక్షతన బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల్య వివాహ నిరోధక చట్టం–2006 ప్రకారం 18 ఏళ్లలోపు అమ్మాయిలకు, 21 ఏళ్లలోపు అబ్బాయిలకు వివాహాలు చేయొద్దని అన్నారు. బాల్య వివాహాలు జరిపిస్తే టోల్‌ఫ్రీ నంబర్‌ 1098 లేదా 100కు ఫోన్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో బాలల పరిరక్షణ విభాగం జౌట్‌రీచ్‌ వర్కర్‌ విజయ్‌కుమార్‌, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్‌లు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement