సంగెం : మండలంలోని గవిచకు చెందిన రైతు గుండు వెంకటనర్సు ఇటీవల వడదెబ్బతో మృతి చెందిన క్రమంలో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆయన ఆధ్వర్యంలోని బృందం శనివారం పరామర్శించింది. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడారు. వెంకటనర్సు ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్లి, అనంతరం కాపుల కనపర్తిలోని కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న కాంటా వేయించుకోవడానికి ఎండలోనే వేచి ఉన్నాడని తెలిపారు. తదనంతరం ఇంటికి చేరుకున్నాక అస్వస్థతకు గురై మృతి చెందినట్టు వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య, ఉపాధ్యక్షుడు ఊరటి హంసారెడ్డి, నాయకులు కృష్ణ, తిరుపతి, ఐలయ్య, శ్రీనివాస్, రమేశ్, వార్డు సభ్యుడు బాషిపాక అశోక్ తదితరులు పాల్గొన్నారు.


