● చైర్మన్ చొరవతో నష్టనివారణ
వర్ధన్నపేట : పట్టణంలోని కోనాపురం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు శనివారం మధ్యాహ్నం మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. ఈ క్రమంలో 12వ డివిజన్ కౌన్సిలర్ తిరుపెల్లి వాణికుమార్ స్వామి వెంటనే మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణికి సమాచారం అందించగా వ్యక్తిగత పనులపై హనుమకొండలో ఉన్నప్పటికీ ఆయన సత్వరమే స్పందించి రైతులకు నష్టం జరగకుండా నివారించారు. మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని వర్ధన్నపేట ఫైర్ సిబ్బందికి తెలియజేయగా అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వరంగల్లోని ఫైర్స్టేషన్ అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలో వరంగల్ను ఫైర్ ఇంజన్ కోనాపురం కొనుగోలు కేంద్రానికి చేరుకుంది. సిబ్బంది వెంకన్న, కుమారస్వామి, ప్రసాద్, కరుణాకర్, వాజిత్ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కొనుగోలు కేంద్రంలోకి మంటలు వ్యాపించకముందే చైర్మన్, వరంగల్ ఫైర్ స్టేషన్ సిబ్బంది స్పందించడం పట్ల రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కొనుగోలు కేంద్రానికి మంటలు వ్యాపించి భారీ నష్టం జరిగేదని రైతులు తెలిపారు. కాగా వరికొయ్యలకు నిప్పు పెట్టడం వల్లే మంటలు క్రమంగా కొనుగోలు కేంద్రం పరిసరాల్లోకి చేరినట్టు తెలిసింది.
గడ్డివాము దగ్ధం
నర్సంపేట రూరల్ : ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన ఘటన నర్సంపేట మండలంలోని రామవరంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బైరి మాధవరెడ్డి ఏర్పాటు చేసుకున్న 5 ఎకరాల గడ్డికట్టలు శనివారం ప్రమాదవశాత్తు నిప్పంటుకున్నాయి. గడ్డితోపాటు పొలంలో ఉన్న డ్రిప్, పీవీసీ పైపులు సైతం కాలిపోయాయి. బాధిత రైతుకు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లింది. సర్పంచ్ ఎర్రం అనిత మోహన్ స్పందించి జేసీబీతో గడ్డికట్టలను దూరం చేయించి పైర్ సిబ్బందితో మంటలను అర్పించారు.


