ఖానాపురం : మండలంలోని ధర్మరావుపేటకు చెందిన పీసరి రంజిత్ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబానికి గ్రామస్తులు, నేతాజీ యువజన సంఘం బాధ్యులు, రంజిత్ పదో తరగతి నాటి స్నేహితులు శనివారం చేయూత అందించారు. గ్రామస్తులు రూ.42 వేలు విరాళాలు సేకరించగా నేతాజీ యువజన సంఘం బాధ్యులు రూ.20 వేలు సమకూర్చారు. అలాగే రంజిత్ స్నేహితులు రూ.20 వేలు అందించారు. మొత్తం డబ్బులను రంజిత్ కుమార్తె హయంషి పేరిట పోస్టాఫీసులో డిపాజిట్ చేసి బాండ్ పత్రాలను సర్పంచ్ మాడ్రాజు వెంకన్న చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో కూస కుమారస్వామి, సోమన్న, కుమారస్వామి, మోహన్, వల్లె శ్రీనివాస్, సురేశ్, రాంబాబు, అనిల్, రమేశ్, తోట రవి, పంచాయతీ కార్యదర్శి అనిత, తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపాలనలోనే అభివృద్ధి
మామునూరు : ప్రజాపాలన ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. శనివారం వరంగల్ 17వ డివిజన్ బొల్లికుంటలో రూ.60లక్షల వ్యయంతో చేపడుతున్న కూడలి అభివృద్ధి, సీసీరోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద, మున్సిపల్ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, గుండు సుధారాణితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలీనగ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రతి కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులను శాలువాలతో సన్మానించి కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, ఆర్ఐ కీర్తన్, లబ్ధిదారులు పాల్గొన్నారు.


