● ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికిరణ్
నర్సంపేట : జీవవైవిధ్యంతో మానవ మనుగడ సాధ్యమని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ తెలిపారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో జీవవైవిధ్య పరిరక్షణకు సంబంధించిన వాల్పోస్టర్లను రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. నానాటికీ వాతావరణ కాలుష్యం పెరుగుతుండడంతో అనేక జీవరాశులు అంతరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వచ్చంద సంస్థల సమాఖ్య అధ్యక్షుడు గిరగాని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ పంటల సాగులో రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల మేలు చేసే కీటకాలు నశిస్తున్నాయని చెప్పారు. ఏఎస్ఆర్ సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని విడనాడి జీవజాతులను రక్షించాలని కోరారు. స్వయంకృషి సంస్థ నిర్వాహకుడు బెజ్జంకి ప్రభాకర్ మాట్లాడుతూ భూమిపై కనీసం 33 శాతం అడవులు ఉండాలన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతిభ సంస్థ ప్రతినిధి బోయిని వెంకటస్వామి, వలంటీర్ కాసుల వెంకటాచారి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు సోమ్లానాయక్, ధర్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


