● వ్యవసాయ శాస్త్రవేత్త నాగభూషణం
ఎల్కతుర్తి: రైతులు వరిసాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులు సాగుచేసి భూమిలో కలియదున్నడం వల్ల పంటలో వేసే యూరియా శాతాన్ని తగ్గించుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త నాగభూషణం అన్నారు. శుక్రవారం మండలంలోని కోతులనడుమలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు వానాకాలం పంటల సాగుపై అవగాహన కల్పించారు. ముందుగా రైతులకు ముఖ్య ఉద్దేశాలను వివరించారు. వ్యవసాయ శాస్త్రవేత్త నాగభూషణం మాట్లాడుతూ రైతులు తక్కువ యూరియా వాడి సాగు ఖర్చు తగ్గించుకోవచ్చన్నారు. అవసరం మేరకు రసాయనాలను వినియోగించి నేల ఆరోగ్యం కాపాడాలన్నారు. పంట మార్పిడిని పాటించి సుస్థిర ఆదాయం పొందాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మాట్ల లింగయ్య, శాస్త్రవేత్త శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి రాజ్కుమార్, సారంగం, ఏఈఓ తిరుపతి, బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.


