రామన్నపేట: పుస్తక పఠనంతోనే నిరంతర విజ్ఞానం సాధ్యమని వరంగల్ అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్ అన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యా వారోత్సవాల సందర్భంగా శుక్రవారం వరంగల్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రంథాలయ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఈఓ రంగయ్యనాయుడు, వరంగల్ ఎంఈఓ వెంకటేశ్వరావు, మట్టెవాడ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కె.అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.
హన్మకొండ: బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి బి.నిర్మల తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలెబుల్ స్కూల్ స్కీమ్ కింద ఒకటో తరగతి, ఐదో తరగతిలో అడ్మిషన్ కల్పించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాకు ఒకటో తరగతిలో 87 సీట్లు, 5వ తరగతిలో 88 సీట్లు కేటాయించినట్లు వివరించారు. ఈ నెల 15 నుంచి జూన్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు హనుమకొండ, హసన్పర్తి సహాయ సాంఘిక సంక్షేమాధికారి కార్యాలయం నుంచి దరఖాస్తు ఫామ్ పొంది, పూర్తి చేసిన దరఖాస్తులను అదే కార్యాలయంలో జూన్ 6న సాయంత్రం 5 గంటల్లోపు అందించాలని సూచించారు.
వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం విద్య, వైద్యం తర్వాత క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని హనుమకొండ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్, బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఏర్పాటైన తర్వాత మొదటి కార్యవర్గ సమావేశాన్ని శుక్రవారం హనుమకొండ రెడ్డికాలనీలోని వారాహి బాంక్వెట్ హాల్లో నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అసోసియేషన్ చైర్మన్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్లో నగరంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. అనంతరం జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బైరబోయిన కై లాస్యాదవ్, తెలంగాణ రాష్ట్ర జూడో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి దుపాకి సంతోశ్కుమార్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్లు నాయకపు నాగరాజు, బొడ్డు విష్ణువర్ధన్, వల్లెం సుధాకర్, సంపత్, రాజు, రామకృష్ణ, దాసారపు సారయ్య, పరిపూర్ణచారి తదితరులు పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. హనుమకొండ జిల్లాలో 32 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం ఇంటర్ ఫస్టియర్ జనరల్, ఒకేషనల్ కలిపి 8,226 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 7,732 మంది (94 శాతం) హాజరయ్యారు. 494 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్ సెకండియర్లో 1,965 మంది విద్యార్థులకుగాను 1,811 మంది హాజరుకాగా.. (92 శాతం) 154 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ తెలిపారు.
హన్మకొండ కల్చరల్: వరంగల్ దేవాదాయఽ ధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఈ నెల 18 నుంచి ప్రతీ సోమవారం ధర్మవాణి కార్యక్రమం నిర్వహిస్తామని వరంగల్ దేవాదాయశాఖ డీసీ, అసిస్టెంట్ కమిషనర్ సునీత శుక్రవారం తెలిపారు. ప్రజలు, భక్తులు, అర్చకులు, ఇతర ఉద్యోగులు తమ సమస్యలను వివరించి, పరిష్కరించుకోవచ్చునని పేర్కొన్నారు.


