● రహదారిపై ఆందోళన
వర్ధన్నపేట : తన పిల్లలను తనకు ఇప్పించాలని కోరుతూ పట్టణంలోని పోలీస్స్టేషన్ సమీపంలో యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీస్స్టేషన్ సమీపంలో రహదారిపై బంధువులతో కలిసి ఆమె ఆందోళనకు దిగింది. వివరాలిలా.. గుబ్బెటితండాకు చెందిన సురేశ్కు తాళ్లకుంటతండాకు చెందిన మౌనికతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగి ముగ్గురు పిల్లలు కలిగారు. సురేశ్కు వివాహేతర సంబంధం ఉందని గతేడాది జరిగిన గొడవలో సురేశ్ తండ్రి మృతి చెందాడు. సురేశ్ జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చాడు. సురేశ్ పిల్లలను మౌనిక నుంచి తీసుకెళ్లి మరో యువతితో సహజీవనం సాగిస్తున్నాడు. తన పిల్ల లను తనకు ఇప్పించాలంటూ మౌనిక పెద్దమనుషులకు, పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసింది. మూడ్రోజుల క్రితం మౌనిక మళ్లీ పోలీసులను ఆశ్రయించగా ఇరు కుటుంబాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో బుధవారం పోలీస్స్టేషన్ బయట ఇరు కుటుంబాల పెద్దలు పంచాయతీ నిర్వహిస్తుండగా ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్ల పరస్పరం దాడి చేసుకున్నారు. మౌనిక ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అలాగే రోడ్డుపై వెళ్తున్న వాహనం కింద పడేందుకు ప్రయత్నం చేసింది. సుమారు రెండు గంటలపాటు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు సురేశ్ను అదుపులోకి తీసుకోగా పోలీసులు సురేశ్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, లంచం డిమాండ్ చేస్తున్నారని, తన పిల్లలను సురేశ్తో కలిసి ఉంటున్న యువతి హింసిస్తోందని మౌనిక ఆరోపించింది. సీఐ శ్రీనివాస్, ఎస్సై సాయిబాబు ఇరువర్గాలను అదుపులోకి తీసుకొచ్చారు.


