కాళోజీ సెంటర్: వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా వారిలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు జిల్లా విద్యాశాఖ సమాయత్తమైంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక వేసవి శిబిరాల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. విద్యార్థుల ప్రతిభా, వికాసం, నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ఈ శిబిరాలను రూపొందించారు. టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఈనెల 12 నుంచి జూన్ 3 వరకు నిపుణులైన ఉపాధ్యాయులచే నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
ఆటపాటలతో పాటు అభ్యసనం
జిల్లాలోని 11 పీఎం శ్రీ పాఠశాలల్లో ఈనెల 11 నుంచి 25వ తేదీ వరకు ప్రతీ రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ శిబిరాలు జరుగుతాయి. ఇందులో కేవలం చదువే కాకుండా విద్యార్థులకు ఇష్టమైన అనేక అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. శారీరక ధృడత్వం, ఆటలు, యోగా, సృజనాత్మకత, డ్రాయింగ్, పెయింటింగ్, భాషా నైపుణ్యం, స్పీకింగ్, రీడింగ్ స్కిల్స్, మాథ్స్, సైన్స్లో సులభతర పద్ధతులను వివరించనున్నారు.
ఫెయిల్ అయిన విద్యార్థులకు
ప్రత్యేక తరగతులు
టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు విద్యాశాఖ ప్రత్యేక చొరవ తీసుకుంది. విద్యార్థులు తిరిగి విజయం సాధించేలా ఈ నెల 12 నుంచి జూన్ 3వ తేదీ వరకు ప్రత్యేక సమ్మర్ క్యాంపులు నిర్వహించనున్నారు. వీరి కోసం నరేంద్రనగర్ ప్రభుత్వ హైస్కూల్, నర్సంపేట జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక తరగతుల్లో రిమీడయల్ క్లాసులు, నిపుణులైన ఉపాధ్యాయులతో బోధన, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా మానసిక ప్రోత్సాహం ఇవ్వనున్నారు.
విజయవంతంగా నిర్వహించాలి
రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో సమ్మర్ క్యాంపులు విజయవంతంగా నిర్వహించాలి. శిబిరాల నిర్వహణకు అవసరమైన విద్యా సామగ్రి క్రీడా వస్తువుల కొనుగోలుకు ఇప్పటికే నిధులు కేటాయించాం. హెచ్ఎంలు, ఎస్ఎంసీలు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలి.
–బి.రంగయ్య నాయుడు, డీఈఓ
జిల్లాలో 11 పీఎంశ్రీ పాఠశాలలు ఎంపిక
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యం
టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకూ
తరగతులు


