‘నీట్‌’కు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’కు పకడ్బందీ ఏర్పాట్లు

May 2 2026 7:20 AM | Updated on May 2 2026 7:20 AM

కేయూ క్యాంపస్‌: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకుగాను దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించనున్న నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (నీట్‌)– 2026కు ఉమ్మడి జిల్లాలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తంగా 14 కేంద్రాల్లో కలిపి 6,016 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచే సెంటర్‌లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1–30 గంటలకు మెయిన్‌ గేట్లను మూసివేస్తారు. ఆ తర్వాత వచ్చేవారికి అనుమతించరు. దివ్యాంగ అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు అదనంగా గంట సమయం ఇస్తారు. ఆయా అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. హనుమకొండ, వరంగల్‌లోని పరీక్ష కేంద్రాల్లో ఐదుగురు స్క్రైబర్స్‌ను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు రెండు జిల్లాల నీట్‌ నోడల్‌ ఆఫీసర్‌ భిక్షపతి తెలిపారు.

నిబంధనలు కఠినం..

● అభ్యర్థులు అడ్మిట్‌ కార్డుతోపాటు రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, 4X6 సైజ్‌ ఫొటో ఒకటి, ఏదైనా గుర్తింపుకార్డు వెంట తీసుకునిరావాలి.

● పెన్ను, పెన్సిల్‌ తీసుకురావొద్దు. వీటిని పరీక్ష కేంద్రాల్లోనే అందజేస్తారు.

● బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ తీసుకుంటారు.

● ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, వాచ్‌లు తీసుకురావొద్దు,

● మహిళలు బంగారు నగలు పెట్టుకొని రాకూడదు. ఒకవేళ పెట్టుకుని వస్తే కేంద్రం వద్ద తీసివేయిస్తారు.

● కాళ్లకు షూ ధరించకూడదు. జీన్స్‌లాంటివి కాకుండా ఇతర సాధారణ దుస్తులు ధరించి రావాలి.

● పారదర్శకంగా ఉండే వాటర్‌ బాటిల్స్‌ను తీసుకురావచ్చు.

● డయాబెటిక్‌ కలిగిన అభ్యర్థులుంటే వారు పండ్లు (అరటి, యాపిల్‌) తీసుకొని రావచ్చు.

● ప్రతి గదిలో, మెయిన్‌ గేట్‌వద్ద అందరికీ కనిపించేలా గడియారాలు ఏర్పాటు చేస్తారు.

ఉమ్మడి జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఇలా..

● వరంగల్‌ నిట్‌లో రెండు సెంటర్లు, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (కో ఎడ్యుకేషన్‌), వరంగల్‌లో సీకేఎం కళాశాల, ఎల్‌బీ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాల.

● జయశంకర్‌ భూపాలపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో), ప్రభుత్వ జూనియర్‌ కళాశాల.

● జనగామ జిల్లా కేంద్రంలోని ఏవీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల విద్యాలయం.

● మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల.

● మహబూబాబాద్‌లో నీట్‌ నోడల్‌ ఆఫీసర్‌గా కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ ముఖేశ్‌కుమార్‌ వ్యవహరించనున్నారు.

రేపు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహణ

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు

ఉదయం 11 గంటల నుంచే సెంటర్లలోకి అనుమతి

మధ్యాహ్నం 1–30 గంట తర్వాత నో ఎంట్రీ

హాజరుకానున్న 6,016 మంది అభ్యర్థులు

Advertisement
 
Advertisement
Advertisement