టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ గంధం రాజేందర్
నెక్కొండ: గ్రామీణ ప్రాంత ప్రజలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించేందుకు ప్రభుత్వం సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోందని టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ గంధం రాజేందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం నెక్కొండలో ‘పీఎం సూర్యఘర్ మస్త్ బిజిలీ యోజన’పై చేపట్టిన ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకొని సూర్యశక్తిని విద్యుత్ శక్తిగా మార్పిడి చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు ఆకర్షణీయమైన సబ్సిడీ అందిస్తోందన్నారు. ఒక కిలోవాట్కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు కిలోవాట్లకు రూ.78వేలు చొప్పున సబ్సిడీ ఇస్తుందని ఆయన వివరించారు. ఇందులో మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించి ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. సోలార్ ప్యానల్స్ ద్వారా సుమారు 25 సంవత్సరాలపాటు ఉచిత విద్యుత్ను పొందవచ్చునని, అందరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో టీజీ రెడ్కో ఫీల్డ్ ఆఫీసర్ నవీన్కుమార్, నెక్కొండ జీపీ ఈఓ సదానందం, గ్రామస్తులు పాల్గొన్నారు.


