● అదనపు కలెక్టర్ సంధ్యారాణి
ఖిలా వరంగల్: విత్తన డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని, నకిలీ విత్తనాలు విక్రయించినా, నిబంధనలు ఉల్లంఘించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ సంధ్యారాణి హెచ్చరించారు. వరంగల్ శివనగర్లోని సాయి కన్వెన్షన్హాల్లో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. డీలర్లు ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ మాట్లాడుతూ నాసిరకం విత్తనాలు విక్రయించినా, నకిలీ బిల్లులు ఇచ్చినా, లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టాస్క్ఫోర్స్, తనిఖీ బృందాలు నిరంతరం విత్తన షాపులను తనిఖీ చేస్తాయని పేర్కొన్నారు. ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ నిర్మల, వర్ధన్నపేట ఏడీఏ నర్సింగం, ఇన్చార్జ్ ఏడీఏ నర్సంపేట నగేశ్, ఏడీఏ టెక్ కల్పన, ఏసీపీ వెంకటేశ్, ఏఎంవీఐ ఉదయ్కుమార్, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ శ్రీనివాస్, ఎఫ్సీఓ ల్యాబ్ ఏడీఏ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఏఓలు రవీందర్రెడ్డి, విజ్ఞాన్, డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్లు వెంకటేశ్వర్లు, డీలర్లు పాల్గొన్నారు.
మక్కల కొనుగోళ్లలో వేగం పెంచాలి..
నెక్కొండ: మక్కల కొనుగోళ్లలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీఏఓ అనురాధ, డీసీఓ నీరజ, తహసీల్దార్ రాజ్కుమార్, ఎస్సై మహేందర్, మార్కెట్ కార్యదర్శి కృష్ణమీనన్రావుతో మక్కల కొనుగోలు నిర్వహణ కమిటీని ఆమె ప్రకటించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మక్కల కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీపుకోవాలని ఆదేశించారు. మక్కలను నిల్వ చేసేందుకు సాయిరెడ్డిపల్లి గ్రామంలో వీకేఆర్ గోదాం, స్థానికంగా ఉన్న కాటన్ జిన్నింగ్ మిల్లులోని గోదాములను వినియోగించుకోవాలని మార్క్ఫెడ్ అధికారులకు సూచించారు. ఏఓ నాగరాజు, ఆర్ఐ నరేందర్, జీపీఓలు తదితరులు పాల్గొన్నారు.


