● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
నర్సంపేట రూరల్ : చట్ట విరుద్ధమైన దత్తత, బాలల అమ్మకం నేరమని, దత్తతను చట్టబద్ధమైన మార్గంలోనే స్వీకరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. చైల్డ్సేఫ్టీ వీక్లో భాగంగా నర్సంపేట ఎంపీడీఓ కార్యాలయంలో దత్తత, ఫాస్టర్ కేర్పై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చట్ట విరుద్ధమైన దత్తత, బాలల అమ్మకం వంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఇలాంటి ఘటనలు ఎవరి దృష్టికి వచ్చినా 1098 ద్వారా జిల్లా బాలల పరిరక్షణ విభాగం దృష్టికి తీసుకురావాలని కోరారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీడబ్ల్యూఓ రాజమణి, ఆర్డీఓ ఉమారాణి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, డీసీపీఓ ఉమ, ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
కలిసికట్టుగా పనిచేయాలి..
కాళోజీ సెంటర్: చట్ట విరుద్ధమైన దత్తతను ప్రోత్సహించడం నేరమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో గురువారం దత్తత సహాయ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించి ఆమె ప్రారంభించి మాట్లాడారు. దత్తత సమాచారం తెలపడం, అనుమానాలను నివృత్తి చేయడం కోసం ఈ కేంద్రం ప్రతి సోమవారం పనిచేస్తుందని తెలిపారు. చట్ట విరుద్ధమైన దత్తతను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, డీడబ్ల్యూఓ రాజమణి, బీఆర్బీ భవన్ కోఆర్డినేటర్ ఉమ పాల్గొన్నారు.


