
వారానికి రెండ్రోజులే..!
ఎంజీఎం: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యసేవల తీరుపై కొన్ని నెలలుగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో రోగులను ఈ ఆస్పత్రికి తీసుకురావడానికి పేదలు సైతం జంకే పరిస్థితి నెలకొంది. కీలక విభాగాల వైద్యులందరూ హైదరాబాద్నుంచి వరంగల్ నగరానికి అప్అండ్డౌన్ చేస్తున్నారు. దీనివల్ల ఆస్పత్రికి సమయానికి రాకపోవడం.. తొందరగా వెళ్తుండడంతో ప్రజలకు సరైన వైద్యసేవలు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంజీఎంపై పేద ప్రజలకు భరోసా కల్పించడానికి కలెక్టర్ ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించినా, ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో మార్పు రాని పరిస్థితి. గతంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మూడు సార్లు పర్యటించి వైద్యుల గైర్హాజరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇకనుంచి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించగా నామమాత్రంగా మెమోలు జారీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఎంజీఎం ఆస్పత్రిపై జిల్లా మంత్రి, ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టిసారించి పేదలు ప్రాణా లకు భరోసా కల్పించాలని వేడుకుంటున్నారు.
బయోమెట్రిక్
అటెండెన్స్పై చర్యలు శూన్యం
ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది హాజరుశాతం కోసం ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరాలు నామమాత్రంగా మారాయి. ఈపరికరాల ద్వారా నమోదైన హాజరుతో ఇంత వరకు ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడం.. వేతనాల్లో కోత విధించకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి మారింది.
ప్రజాప్రతినిధులారా దృష్టి సారించండి..
వేలాది మంది వైద్యం కోసం ప్రాణాలు అరచేతిలో పట్టుకునే వచ్చే ఎంజీఎం ఆస్పత్రి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టిసారించాలని పేదలు వేడుకుంటున్నారు. మందుల సరఫరాతో పాటు వైద్యసేవలు, పూర్తిస్థాయి అధికారులను నియమించి పేదల ఆరో గ్యానికి భరసా కల్పించాలని వేడుకుంటున్నారు.
ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు..
ఎంజీఎం ఆస్పత్రిలో పలు విభాగాల్లో విధులు నిర్వర్తించే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు వేతనాలు ఇస్తోంది. వా రు యూనిట్ చీఫ్గా ఉన్నా.. వారానికి ఒకటి, రెండు రోజుల్లో కనీసం మూడు గంటల పాటు మాత్ర మే విధులు నిర్వర్తిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా సమస్య చెప్పుకుందామని వెళ్తే ఆర్ఎంఓల కుర్చీలు ఎప్పుడు చూసినా ఖాళీగా దర్శనమిస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. ఈ విష యం కలెక్టర్తోపాటు, ఎంజీఎం సూపరింటెండెంట్కు స్పష్టంగా తెలుసు. కానీ, వీరిపై చర్యలు తీసుకోవడానికి తమకు అధికారం లేదని పరిపాలనాధికారులు పేర్కొంటున్నారు. వీరిపై రాష్ట్రస్థాయిలో డీ ఎంఈ స్థాయి అధికారి మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఉండడం వీరికి వరంగా మారింది.
హైదరాబాద్ నుంచి అప్అండ్డౌన్
ఆస్పత్రిలోని కీలక మెడిసిన్, ఆర్థోపెడిక్, సర్జరీ, పిడియాట్రిక్, డెర్మటాలజీ, సైకియాట్రిస్ట్ వంటి విభాగాల్లోని సుమారు 25 మందికిపైగా వైద్యులు హైదరాబాద్ నుంచి వరంగల్ నగరానికి అప్అండ్డౌన్ చేస్తున్నారు. ప్రతీ విభాగంలో ముగ్గురునుంచి నలుగురు వైద్యులు ఈరకంగా ప్రయాణం చేస్తున్నారు. హాజరు శాతం కోసం వస్తూ లక్షల్లో వేతనాలు తీసుకుంటూ.. పేద ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా మిగతా జిల్లాల్లో దీర్ఘకాలికంగా ఉన్న వైద్యులను బదిలీ చేసింది. ఈక్రమంలో ఎంజీఎంలో ఉన్న వైద్యులు నర్సంపేట, ములుగు, భూపాలపల్లి, జనగామ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు బదిలీ కాగా, హైదరాబాద్లో దీర్ఘకాలికంగా ఉన్న వైద్యులు ఎంజీఎంకు బదిలీ అయ్యారు. అసలు సమస్య అప్పుడే మొదలైంది. సాధారణ బదిలీల తర్వాత పాలన ఎలా సాగుతుందనే విషయంపై పర్యవేక్షణ లేకపోవడం వల్ల పేద ప్రజలకు శాపంగా మారింది.

వారానికి రెండ్రోజులే..!