
ఓరుగల్లు ఖ్యాతి చాటేలా ఉత్సవాలు
సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ఓరుగల్లు ఖ్యాతి చాటేలా గురువారం దసరా వేడుకలు నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహించనున్న ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాతలు 70 అడుగుల రావణుడి ప్రతిమను తయారు చేయించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖ స్విచ్ నొక్కి రావణ దహనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించనున్నాయి.
ఊరేగింపుతో సీతారాములు రాక..
కరీమాబాద్లోని రంగనాథస్వామి దేవాలయం నుంచి సీతారాముల ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు అలంకరించిన ఎడ్లబండిపై ఉత్సవమూర్తులను ఉంచి భారీ ఊరేగింపుతో రంగలీల మైదానానికి తీసుకొస్తారు. అక్కడ రాముడు, రావణుడి డిజిటల్ బొమ్మలు ఏర్పాటు చేశారు. రావణుడి బొమ్మను బాణాలతో రాముడు కాల్చే ప్రక్రియ నేత్రపర్వంగా నిర్వహిస్తారు.
పటిష్టమైన భద్రత..
వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ పర్యవేక్షణలో ఏఎస్పీ శుభం నేతృత్వంలో దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా వేర్వేరుగా విశాలమైన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. డీసీపీ సలీమా, ఏసీపీలు, ఐదుగురు ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్సైలు, 200 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించనున్నారు. కాగా, బుధవారం సాయంత్రం ఏఎస్సీ శుభం రంగలీల మైదానంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
10 రోజులుగా అధికారుల ఏర్పాట్లు
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలో దసరాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 10 రోజులుగా వివిధ శాఖల అధికారులు చేశారు. వరంగల్లోని ఉర్సు రంగలీల మైదానం, పద్మాక్ష్మిగుట్ట వద్ద విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రోడ్లను చదును చేసి తుమ్మ, పిచ్చి మొక్కలను తొలగించారు. తాత్కాలికంగా వీధిలైట్లు అమర్చారు. ప్రత్యేకంగా నాలుగు వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసినట్లు బల్దియా ఇంజనీర్లు తెలిపారు.
ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
వరంగల్ క్రైం: ఉర్సు రంగలీల మైదానంలో జరిగే దసరా ఉత్సవాల సందర్భంగా గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు.
● ఖమ్మం నుంచి వరంగల్ మీదుగా కరీంనగర్, హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు పున్నేలుక్రాస్ నుంచి ఐనవోలు ఆర్చ్, వెంకటాపురం, కరుణాపురం మీదుగా వెళ్లాలి.
● కరీంనగర్ నుంచి ఖమ్మం వెళ్లాల్సిన వాహనాలు, కొత్తపేట, ఏనుమాముల, లేబర్కాలనీ, తెలంగాణ జంక్షన్, ఫోర్ట్రోడ్డు జంక్షన్ మీదుగా వెళ్లాలి.
● హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లాల్సిన వాహనాలు కరుణాపురం, వెంకటాపురం, ఐనవోలు, పున్నేలు క్రాస్ నుంచి వెళ్లాలి.
● హనుమకొండ హంటర్ రోడ్డు నుంచి ఉర్సు గుట్టకు వచ్చే వాహనాలు కొలంబో హాస్పిటల్ ఎదుట ఉన్న గానుగ ఆయిల్ పాయింట్ దగ్గర, ఆకుతోట ఫంక్షన్హాల్, నాని గార్డెన్, జేఎస్ఎం స్కూల్లో పార్కింగ్ చేసుకోవాలి. కడిపికొండ నుంచి వచ్చే వాహనాలు భారత్ పెట్రోల్ పంపు దగ్గర పార్కింగ్ చేసుకోవాలి.
● ఆర్టీఓ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు లవ్లీ ఫంక్షన్ హాల్ ఓపెన్ ప్లేస్, తాళ్ల పద్మావతి కళాశాల దగ్గర పార్కింగ్ చేసుకోవాలి.
● కరీమాబాద్ నుంచి వచ్చే వాహనాలు బీరన్న గుడి దగ్గర పార్కింగ్ చేసుకోవాలి.
రంగలీల మైదానంలో
దసరాకు ఏర్పాట్లు
హాజరుకానున్న లక్షలాది మంది భక్తులు
ఈసారి 70 అడుగుల రావణుడి
ప్రతిమ దహనం

ఓరుగల్లు ఖ్యాతి చాటేలా ఉత్సవాలు